
రాహుల్ను (rahul gandhi) ఉద్ధేశించి అసోం సీఎం (himanta biswa sarma) అన్న వ్యాఖ్యలన్ని తాను తేలిగ్గా వదిలేయనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ (bjp) క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి మోడీని పిలవాలో లేదో ఆలోచిస్తామన్నారు. దళిత సంఘాలకు , రాజ్యాంగానికి సంబంధం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తారని.. ఈ తరహా రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని కేసీఆర్ హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వంలో గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని సీఎం ఆరోపించారు. తాను కాంగ్రెస్కు (congress) మద్ధతివ్వడం లేదని, రాహుల్ గాంధీ విషయం మాట్లాడానని కేసీఆర్ స్పష్టం చేశారు.
దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు కోసం కొత్త రాజ్యాంగం రాయాలని సీఎం డిమాండ్ చేశారు. యూపీ ఎన్నికల పోలింగ్ మరుసటి రోజే పెట్రోల్ ధరలు పెరుగుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని.. దీనిని అరికట్టడానికి కొత్త రాజ్యాంగం రాయాలన్నారు. దేశమంతా దళితబంధు పెట్టాలని.. దీని కోసం రాజ్యాంగం రాయాలంటున్నానని, దళిత సంఘాలు వద్దంటాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా కన్నా గొప్ప ఆర్ధికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం , కొత్త స్పూర్తి రావాలన్నారు. తెలంగాణలాగా భారతదేశం కూడా మారడానికి కొత్త రాజ్యాంగం రావాలంటున్నానని సీఎం చెప్పారు.
77 శాతం దేశ సంపద 10 శాతం మంది దగ్గరే వుందని.. ధనికులు ఇంకా ధనికులవుతున్నారని, పేదలు మరింత పేదలవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని.. వాట్సాప్ యూనివర్సిటీతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. పేదలకు సబ్సిడీ ఎత్తేసి.. దొంగలకు సద్ది కట్టాలి, ఇది కేంద్రం తీరని సీఎం దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో 33 మంది బ్యాంకులను ముంచి పారిపోయారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
పార్లమెంట్లో ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ ప్రభుత్వమే చెప్పిందని సీఎం తెలిపారు. ఈడీ పెడతాం, సీబీఐ పెడతాం అని బెదిరిస్తున్నారని ... ఎన్నికల్లో గెలవకపోయినా పరిపాలన చేసే సిగ్గులేని పార్టీ బీజేపీ అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ పరువు పోలేదా అని ఆయన గుర్తుచేశారు. రాఫెల్పై రాహుల్ మాట్లాడితే ఆయనపై ఎదురుదాడి చేశారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధానికి క్షమాపణ చెప్పడం అలవాటేనని.. ప్రధాని అయితే గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయా అని అడిగితే, ముస్లింలకు మోడీ క్షమాపణ చెప్పారని సీఎం గుర్తుచేశారు.
క్షమాపణ రాజకీయాలు మోడీకి అలవాటేనని.. బుద్ధి వున్న ఏ ప్రధాని అయినా వేరే దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడాలన్న ఆయన.. కాలేజీల్లో చదివే యువతకు ఏం నేర్పిస్తున్నారో చూడాలని సీఎం వ్యాఖ్యానించారు. తప్పులు ఎత్తి చూపిన ప్రతి పార్టీని అర్బన్ నక్సలైట్ అంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.