సర్పంచ్‌ల అధికారాలకు కత్తెర, పల్లె నడ్డి విరుస్తోంది : కేసీఆర్‌ సర్కార్‌పై బండి సంజయ్ విమర్శలు

Siva Kodati |  
Published : May 31, 2022, 02:24 PM IST
సర్పంచ్‌ల అధికారాలకు కత్తెర, పల్లె నడ్డి విరుస్తోంది : కేసీఆర్‌ సర్కార్‌పై బండి సంజయ్ విమర్శలు

సారాంశం

సర్పంచ్‌ల అధికారాలకు, నిధుల వినియోగానికి టీఆర్ఎస్ సర్కార్ కత్తెర వేస్తోందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. గ్రామాలకు కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన దుయ్యబట్టారు. 

గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా దేశమంతా సర్పంచులకు నిధులు, విధుల వినియోగంలో సర్వాధికారాలనిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ అధికారాలకు కత్తెర వేసిందన్నారు బీజేపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు సంజయ్ (bandi sanjay). అభివృద్ధికి పల్లెలు పట్టుగొమ్మలని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో నిధులు విడుదల చేయకుండా ఆ నడుములను విరిచేస్తోందని ఆయన విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన తెలంగాణ సర్పంచులకు బహిరంగ లేఖ రాశారు. 

పంచాయతీల అభివృద్ధి కోసం 2014 ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం (trs govt) ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడిన ఈ 8 ఏళ్ల పాలనలో జరిగినదేమిటో అర్థం చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. సర్పంచులు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే.. రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకున్న ఆ బిల్లులను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని సంజయ్ దుయ్యబట్టారు. 

నిధులు మంజూరు చేస్తున్నట్టు జీవోలు ఇస్తున్నా.. అకౌంట్లను మాత్రం ఫ్రీజ్ చేస్తోందని ఆయన విమర్శించారు. సర్పంచులెవరైనా ప్రశ్నిస్తే.. సస్పెండ్ చేస్తామని, చెక్ పవర్ ను రద్దు చేస్తామని బెదిరిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. హక్కుల కోసం గాంధేయ మార్గంలో పోరాటం చేయాలని, బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. 

Also Read:భద్రాద్రి పవర్ ప్లాంట్ పెద్ద కుంభకోణం.. మీటర్లు పెడితే విద్యుత్ అక్రమాలు వెలుగుచూస్తాయి: బండి సంజయ్

రాష్ట్రంలోని ప్రతి గ్రామాభివృద్ధిలోనూ కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా ఉందని సంజయ్ పేర్కొన్నారు. సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్న చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠ ధామాలకు రూ.11 లక్షలు, రైతు వేదికకు రూ.10 లక్షలు, పల్లె ప్రకృతి వనానికి రూ.4 లక్షలు, డంప్ యార్డ్ నిర్మాణానికి రూ.2.5 లక్షలు, నర్సరీల ఏర్పాటుకు రూ.లక్షన్నర చొప్పున నిధులను కేంద్రమే కేటాయిస్తోందని బండి సంజయ్ వెల్లడించారు. 

కేంద్రం తన వాటా 100 శాతం చెల్లిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటి వినియోగానికి ఇప్పటిదాకా 15వ కమిషన్ కమిటీ వేయకపోవడం దారుణమన్నారు. ఆ నిధులను రాష్ట్ర సర్కారు పక్కదోవ పట్టిస్తోందని.. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షలు ఇస్తామన్న కేసీఆర్ (kcr) మాటలను నమ్మి సర్పంచులు అప్పులపాలయ్యారని సంజయ్ ఎద్దేవా చేశారు. అప్పులు చేసి అభివృద్ధి చేసిన రైతులకు ఇప్పటికీ సర్కారు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 

దీంతో అప్పులకు వడ్డీలు పెరిగి చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని, చాలా మంది సర్పంచులు కూలి పనులకూ వెళుతున్నారని ఆయన ఆవేదన చెందారు. అయినప్పటికీ కేసీఆర్ బిల్లులు చెల్లించకపోవడం ఆయన కర్కశత్వానికి నిదర్శనమంటూ ఫైరయ్యారు. సర్పంచులు ఏ పార్టీ గుర్తు మీదా గెలిచిన వారు కాదని, అధికార పార్టీ ఆగడాలకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. 

రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైనవన్నీ బీజేపీ ఎంపీల నియోజకవర్గాల్లోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హక్కుల రక్షణ కోసం త్వరలోనే ‘మౌనదీక్ష’ పోరాటం చేస్తామని, దానికి సర్పంచుల మద్దతు కావాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?