మానవ హక్కులను కాలరాస్తోంది మీ అయ్యే.. మానవత్వం లేని మృగం : కవితకు బండి సంజయ్ కౌంటర్

By Siva KodatiFirst Published Dec 13, 2022, 4:31 PM IST
Highlights

తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటరిచ్చారు. మానవ హక్కులను కాలరాస్తోంది మీ అయ్యేనని, ఆయన మానవత్వం లేని మృగం అంటూ వ్యాఖ్యానించారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఆమెను అరెస్ట్ చేస్తారు అనేసరికి రాష్ట్రంలో మహిళలు వారి కళ్లలోంచి నిప్పులు కురిపంచాలా అని ప్రశ్నించారు. తెలంగాణలో అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు జరుగుతుంటే మీ కళ్లలోంచి నిప్పులు ఎందుకు రావడం లేదని సంజయ్ దుయ్యబట్టారు. కల్వకుంట్ల కుటుంబానికి మానవ హక్కులపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన ఎద్దేవా చేశారు. మానవ హక్కులను కాలరాస్తోంది మీ అయ్యేనంటూ కవితపై దుయ్యబట్టారు. ఆయన మానవత్వం లేని మృగం అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు మంగళవారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ పదజాలం అవమానకరంగా ఉందన్నారు. బండి సంజయ్ ఆయన పదవికి మచ్చతెచ్చే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. మహిళలను అవహేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బీజేపీని తిప్పకొడతారని అన్నారు. బతుకమ్మ పండగను అవమానించేలా బండి సంజయ్ మాట్లాడారని.. ఆ మాటలు బాధ కలిగించాయని కవిత చెప్పారు. బీఆర్ఎస్‌తో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఎద్దేవా చేశారు. యాగాలు చేయడం  కేసీఆర్‌కు కొత్త కాదని అన్నారు. బీఆర్ఎస్‌కు దైవశక్తి అవసరం కనుకే యాగాలు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌లో చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయని అన్నారు.  

ALso REad:పొత్తులపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ విషయంలో ఆమె ఏమన్నారంటే..

అభివృద్దిలో బీజేపీని కౌంటర్ చేస్తామని తెలిపారు. నిర్మలా సీతారామన్ వీక్ భాష మీద కాకుండా.. వీక్ రూపాయి గురించి మాట్లాడితే బాగుండేదని అన్నారు. తెలంగాణకు కేంద్ర నుంచి రావాల్సిన నిధులను నిర్మలా సీతారామన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.  వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

ఏపీలో బీఆర్ఎస్ ఏం చేయాలన్నది ఎన్నికలప్పుడే నిర్ణయిస్తామని చెప్పారు. ఏపీ ప్రజలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. తాము ఏపీ రాజకీయ నేతలపైనే మాట్లాడామని చెప్పారు. కాంగ్రెస్‌తో కలవాలో వద్దో కూడా పరిస్థితిని బట్టే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావచ్చని అన్నారు. ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాలలో అభిప్రాయాలు తీసుకుంటామని.. ఏ పార్టీతో వెళ్లాలనేది అప్పుడున్న పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తామని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరు బాగుండాలనేదే బీఆర్ఎస్ అజెండా అని తెలిపారు.  
 

click me!