తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త !.. ఇకపై ఫ‌స‌ల్‌బీమా యోజ‌న‌

By Rajesh KarampooriFirst Published Mar 2, 2024, 4:38 AM IST
Highlights

CM Revanth: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతుల‌కు ద‌న్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్‌బీమా యోజ‌న‌లోకి తిరిగి తెలంగాణ‌ ప్రభుత్వం చేరుతుందని పేర్కొన్నారు.

CM Revanth: రైతుల‌కు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాన్ని బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగంలోని ప్ర‌తికూల‌త‌లు త‌ట్టుకుంటూ రైతులకు ర‌క్ష‌ణగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసున్నారు. కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకమైన ‘ప్ర‌ధానమంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న’ (పీఎంఎఫ్‌బీవై) లో తెలంగాణ మళ్లీ చేరుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

శుక్రవారం రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్య‌ద‌ర్శి రితేష్ చౌహాన్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా పీఎంఎఫ్ బీవైలో 2016 నుంచి 2020 వ‌ర‌కు తెలంగాణ ఉన్న విష‌యం, ఆ త‌ర్వాత నాటి ప్ర‌భుత్వం దాని నుంచి ఉప సంహ‌రించుకున్న తీరును రితేష్ చౌహాన్ తెలిపారు.

అలాగే.. పీఎంఎఫ్ బీవైతో రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని, పంట‌లు న‌ష్ట‌పోయిన‌ప్పుడు స‌కాలంలోనే ప‌రిహారం అందుతుంద‌ని  రితేష్ చౌహాన్ తెలియ‌జేశారు. కేంద్ర పథకంపై చర్చల అనంతరం తెలంగాణ మళ్లీ పథకంలో చేరుతుందని సీఎం రేవంత్ వెల్లడించారు. రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత  విధానాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రితేశ్‌ హర్షం వ్యక్తంచేశారు.

వచ్చే పంట కాలం నుంచి రైతులు ఈ పథకం నుంచి పంటల బీమా పొందుతారని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార శాఖ కార్య‌ద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావు, వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ గోపి త‌దిత‌రులు పాల్గొన్నారు.

click me!