బర్త్‌డే కేక్ ఉసురు తీసింది: ఆస్తి కోసమే సోదరుడే ఇలా చేశాడా?

By narsimha lodeFirst Published Sep 6, 2019, 12:30 PM IST
Highlights

బర్త్ డే కేక్ తిన్న ఇద్దరు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గరయ్యారు. ఆస్తి కోసమే సోదరుడే కేక్ లో విష ప్రయోగం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

చేర్యాల: ఆస్తి కోసం తన సోదరుడి కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు పుట్టిన రోజును అవకాశం ఎంచుకొన్నాడు ఓ వ్యక్తి.  పుట్టిన రోజునే ఆ చిన్నారి మృత్యువు ఒడిలోకి చేరాడు. మరో ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అయినాపూర్ గ్రామంలో ఇస్తారిగల్ల రవి, భాగ్యలక్ష్మి దంపతులు తమ పిల్లలతో నివసిస్తున్నారు. వీరికి పూజిత(13), రామ్‌చరణ్(11) పిల్లలున్నారు. రవి స్వగ్రామం దుబ్బాక మండలం భూంపల్లి. రవి తల్లి పేరు లక్ష్మి,  ఆమె పుట్టిల్లు సిద్దిపేట. ఆమెక అక్క బాలమ్మ, ఇద్దరు చెల్లెళ్లు, ఓ సోదరుడు ఉన్నాడు. బాలమ్మ కొడుకే శ్రీనివాస్. శ్రీనివాస్ కు, రవి కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ గొడవల కారణంగానే అయినాపూర్‌లో రవి స్థిరపడ్డారు.

రెండు రోజుల క్రితం అయినాపూర్ లో రవి బంధువు చనిపోయాడు. బుధవారం నాడు అంత్యక్రియలకు రవి సోదరుడు శ్రీనివాస్ కూడ హాజరయ్యాడు. అక్కడే రవి కుటుంబసభ్యులతో శ్రీనివాస్ మాట్లాడాడు.  అంతలోనే రవి కొడుకు రామ్‌చరణ్ అక్కడి వచ్చాడు. పెదనాన్నా ఇవాళ నా బర్త్‌డే అని చెప్పాడు. ఆ బాలుడితో ఆప్యాయంగా మాట్లాడాడు శ్రీనివాస్.

సిద్దిపేటకు వెళ్లిన తర్వాత తాను కేక్ ను పంపుతానని శ్రీనివాస్ చెప్పాడు. చెప్పినట్టుగానే శ్రీనివాస్  రవి కుటుంబానికి బస్సులో కేక్ పంపాడు.ఈ కేక్ ను కట్ చేశాడు రామ్ చరణ్. ఈ కేక్ ను రవి, ఆయన భార్య భాగ్యలక్ష్మి, రామ్ చరణ్ సోదరి పూజిత తిన్నారు. ఈ కేక్ ను తిన్న తర్వాత రామ్ చరణ్ కడుపు నొప్పితో బాధపడ్డాడు. మిగిలిన కుటుంబసభ్యులు కూడ అస్వస్థతకు గురయ్యారు.

ఆటోలో సిద్దిపేటకు గురువారం తెల్లవారుజామున తరలించారు. మార్గమధ్యలోనే  రవి, రామ్ చరణ్  మృతి చెందారు. పూజిత, భాగ్యలక్ష్మిలు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.భాగ్యలక్ష్మిని సిద్దిపేట ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌ ఆస్పత్రికి.. పూజితను నిలోఫర్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.

రవి కుటుంబంపై విషప్రయోగం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌ను సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణచేస్తున్నట్లు తెలిసింది. అయితే తాను కేక్‌లో ఎలాంటి విషప్రయోగం చేయలేదని పోలీసులకు అతడు చెప్పినట్లు తెలిసింది. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. కేకు తిని తండ్రీకొడుకులు మృతి


 

click me!