హైద్రాబాద్‌పై కరోనా పంజా: మరణాల్లో 80 శాతం ఇక్కడే

By narsimha lodeFirst Published Jun 24, 2020, 10:39 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 62 శాతం హైద్రాబాద్ లోనే రికార్డయ్యాయి. కరోనాతో మరణించిన వారిలో హైద్రాబాద్ లోనే ఎక్కువగా ఉన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 62 శాతం హైద్రాబాద్ లోనే రికార్డయ్యాయి. కరోనాతో మరణించిన వారిలో హైద్రాబాద్ లోనే ఎక్కువగా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 9,533కి చేరుకొన్నాయి. మంగళవారం నాడు ఒక్క రోజే 879 కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో 220 మంది కరోనాతో మరణించారు. ఈ మరణాల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 2వ తేదిన కరోనా కేసు నమోదైంది.  దుబాయ్ నుండి హైద్రాబాద్ కు వచ్చిన యువకుడిలో వైరస్ ను గుర్తించారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.గాంధీ ఆసుపత్రిని కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేశారు. 

హైద్రాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 567 మందికి, బంజారాహిల్స్ లో 317 మందికి, గోషామహల్ లో 677 మందికి, పంజాగుట్టలో 216 మందికి  కరోనా సోకింది. దక్షిణ మండలంలో 87 మంది, పశ్చిమ మండలంలో 67 మంది మరణించారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజూ కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న నేపథ్యంలో  జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

దీంతో రోజుకు కనీసం రెండు నుండి మూడు వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. హైద్రాబాద్ పట్టణంలో 154 కంటైన్మెంట్ ప్రాంతాలు ఉన్నాయి.

ఈ నెల 21వ తేదీ నాటికి జీహెచ్ఎంసీ పరిధిలో 4622 కరోనా కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షల ఎత్తివేతతో పాటు ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడంతో కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. గత నెల 16వ తేదీ నుండి లాక్ డౌన్ ఆంక్షలపై సడలింపులు ఎత్తివేయడం ప్రారంభించారు. 

click me!