పుల్వామా ఉగ్రదాడి.. వీరజవాన్లకు భారీ పరిహారం ప్రకటించిన కేసీఆర్

By ramya NFirst Published Feb 22, 2019, 11:44 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా.. ఈ బడ్జెట్ సమావేశాల్లో ముందుగా వీరజవాన్లకు అసెంబ్లీ నివాళులర్పించింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రకటించారు.

శాసనసభ ప్రారంభం కాగానే పుల్వామా అమరులకు సంతాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నెల 14వ తేదీన జరిగిన దాడి అత్యంత అమానుషమైనదన్నారు. సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగిన దాడిగా కాకుండా సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారని తెలిపారు. 40 మంది జవాన్లు మృతిచెందటం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేయడమే కాదు.. మీవెంట యావత్ జాతి ఉందన్న సందేశం ప్రస్ఫూటంగా పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజల ప్రక్షాన, రాష్ట్రం ప్రక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడమే కాదు.. వారి అమూల్యమైన ప్రాణాలను తిరిగి తేలేకపోయిన ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం పేర్కొన్నారు.

ఇటీవల కశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు 43మంది అమరులైన సంగతి తెలిసిందే. కాగా.. జవాన్లను కోల్పోయిన వారి కుటుంబీకులకు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తరపున ఈ పరిహారం ప్రకటించారు. 

click me!