
కామారెడ్డి: అభం శుభం తెలియని చిన్నారులను స్కూల్ టీచర్ కారు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన దారుణం కామారెడ్డి జిల్లా (kamareddy district)లో చోటుచేసుకుంది. దీంతో చిన్నారులు తల్లిదండ్రుకులకు విషయం చెప్పడంతో సదరుడ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు పనిచేస్తోంది. కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో నివాసముండే సదరు టీచర్ ప్రతిరోజూ కారులో పాఠశాలకు వచ్చేది. దీంతో కారును డ్రైవ్ చేయడానికి కిషన్ అనే వ్యక్తిని నియమించుకుంది.
ప్రతిరోజూ టీచర్ ను స్కూల్ కు తీసుకువెళ్లి తిరిగి తీసుకురావడం చేస్తుండేవాడు కిషన్. ఈ క్రమంలో ఆ స్కూల్లో చదువుకునే చిన్నారులపై అతడి కన్ను పడింది. దీంతో టీచర్ ను తీసుకువచ్చిన తర్వాత స్కూల్ ప్రాంగణంలోనే వుండి చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.
ఇలా నిన్న(సోమవారం) కూడా స్కూల్ కు వచ్చిన కిషన్ చిన్నారులను వేధించాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన చిన్నారులు తల్లిదండ్రులకు విషయం తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు స్కూల్ కి వెళ్లి కిషన్ ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
అంతటితో ఆగకుండా అతడిని పనిలో పెట్టుకున్న టీచర్ పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ కిషన్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే నిర్మల్ పట్టణానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు అభంశుభం తెలియని ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘాతుకాన్ని గోప్యంగా పెట్టే ప్రయత్నం చేయగా బాధితురాలి తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేటకు చెందిన టిఆర్ఎస్ నేత షేక్ సాజిద్ స్థానిక వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికై చిన్నవయసులోనే వైస్ చైర్మన్ పదవిని చేపట్టాడు. ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరైన సాజిద్ ఓ 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. అంతే ఆ బాలికను శారీరకంగా లొంగదీసుకునేందుకు అన్నపూర్ణమ్మ అనే మహిళను రంగంలోకి దింపాడు.
అన్నపూర్ణమ్మ ఆ బాలికను నమ్మించి నిజామాబాద్ వరకు వెళ్లాలి తోడు రమ్మంటూ వెంటబెట్టుకుని వెళ్ళింది. ఆ తర్వాత హైదరాబాదులో ఓ దావత్ ఉందంటూ బాలికను ఓ కారులో అక్కడికి తీసుకెళ్లింది. అయితే చార్మినార్ సమీపంలోని ఓ లాడ్జిలో అప్పటికే బస చేసిన వైస్ చైర్మన్ షేక్ సాజిద్ కు ఆ బాలికను అప్పగించింది. అతను బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.అనంతరం బాలికను బెదిరించి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశాడు.
అయితే భయం భయంగా ఇంటికి వచ్చిన బాలికను... విషయం ఏంటని తల్లి ప్రశ్నించడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. దాంతో ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాజిద్ పై పోక్సో, ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడికి సహకరించిన అన్నపూర్ణమ్మ, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకు వెళ్లిన కారు డ్రైవర్లను నిందితులుగా చేర్చారు.