టార్గెట్ పారిస్ ఒలింపిక్స్ మెడల్.. నిఖత్ జరీన్ కు తెలంగాణ సర్కారు రూ.2 కోట్ల సాయం

By Mahesh RajamoniFirst Published Dec 9, 2023, 7:07 PM IST
Highlights

Nikhat Zareen: తెలంగాణ బిడ్డ, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ బాక్సర్ నిఖ‌త్ జ‌రీన్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పారిస్ ఒలింపిక్స్ లో పతకంతో తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావడానికి  నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించారు.
 

Telangana government: వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ కు సన్నద్ధమయ్యేందుకు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కు తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మ‌హాల‌క్ష్మీ రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆమెకు ఆర్థిక‌సాయం చెక్కును అందజేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఒలింపిక్స్ కు సన్నద్ధమయ్యేందుకు ఈ చెక్కును అందజేసినట్లు నిఖ‌త్ జ‌రీన్ తెలిపారు. దేశానికి, తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ బాక్సర్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం మహిళల సాధికారతకు దోహదపడుతుందని ప్రశంసించారు. ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో నిఖత్ తన ప్రపంచ టైటిల్ ను గెలుచేకున్న సంగ‌తి తెలిసిందే.

26 ఏళ్ల ఈ క్రీడాకారిణి వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. మేరీకోమ్ తర్వాత ఐబీఏ ఉమెన్స్ వరల్డ్ చాంపియన్ షిప్ లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన రెండో భారత మహిళా బాక్సర్ గా నిఖత్ నిలిచింది. గత ఏడాది అక్టోబర్ లో నిఖత్ కు తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్ల నగదు బహుమతిని అందజేసింది. నగదు బహుమతితో పాటు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ లో ఆమెకు నివాస స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

click me!