ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతలకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. కర్నూలు జిల్లాలో సత్యమేవ జయతే బహిరంగ సభలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తున్న రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతలకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. కర్నూలు జిల్లాలో సత్యమేవ జయతే బహిరంగ సభలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తున్న రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మధుయాష్కీలు రాహుల్ తో భేటీ అయ్యారు. నేతలు ఒక్కొక్కరు విడివిడిగా రాహుల్ తో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ పలు కీలక సూచనలు చేశారు.
2014 ఎన్నికల్లో చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని, ఐక్యత లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని ఈ ఎన్నికల్లో అలాంటివి రాకుండా చూడాలని నేతలకు రాహుల్ గాంధీ సూచించారు. అలాగే పొత్తులతో పార్టీ నష్టపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వీటితోపాటు ప్రచార కమిటీ, మేనిఫెస్టో, కూటమిలో సీట్ల సర్ధుబాటుపై చర్చించారు. పొత్తులో పార్టీ నష్టపోకుండా చూడాలని రాహుల్ ఆదేశించారు.
మరోవైపు తెలంగాణలో ఓట్ల అవకతవకలపై పోరాటం చెయ్యాలని సూచించారు. అవసరమైతే న్యాయపోరాటానికి సైతం వెనుకాడొద్దని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ, సోనియాగాంధీ పర్యటనలపై కూడా ప్రధానం గా చర్చించినట్లు తెలుస్తోంది.