
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని చేసిన సిఫారసుల దృష్ట్యా.. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేశారు.
తెలంగాణ హైకోర్టుతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, గౌహతి హైకోర్టులకు కూడా కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తి అజ్మద్ ఏ సయూద్ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఎస్ఎస్ షిండేను రాజస్తాన్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రష్మీన్ ఎం ఛాయను గౌహతి హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
జస్టిస్ భుయాన్ 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 20వ తేదీన నిర్దారించబడ్డారు. మిజోరాం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కూడా ఉన్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అస్సాం జ్యుడీషియల్ అకాడమీ, గౌహతిలోని నేషనల్ లా యూనివర్శిటీలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు.
తర్వాత ఆయన బాంబే హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు. 2019 అక్టోబర్ 3వ తేదీన బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ముంబైలో రెండేళ్లపాటు పనిచేసిన తర్వాత.. ఆయన తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కూడా ఉన్నారు.