
అనారోగ్యంతో మరణించిన తెలుగు సినీ దిగ్గజం, సూపర్స్టార్ కృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలు , అశేష అభిమానుల అశృునయనాల మధ్య ముగిశాయి. ఈ సందర్భంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి కృష్ణకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కృష్ణ కుమారుడు మహేశ్ బాబు తండ్రి చితికి తలకొరివి పెట్టారు.
అంతకుముందు నానక్రామ్ గూడలోని నివాసం నుంచి కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయా స్టూడియోకు తరలించారు. అక్కడ అభిమానులు, పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. అనంతరం పద్మాలయా స్టూడియో నుంచి కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. తర్వాత మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
అంతకుముందు బుధవారం ఉదయం కృష్ణను కడసారి చూసేందుకు పద్మాలయ స్టూడియో వద్దకు అభిమానులు పోటెత్తారు. కృష్ణ పార్ధీవదేహనికి నివాళులర్పించేందుకు వీఐపీలు, వీవీపీలు రావడంతో అరగంటపాటు అభిమానులను నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా స్టూడియో లోపలికి వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించారు. ఫలితంగా తోపులాట చోటు చేసుకుంది. బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు వారిని నిలువరించారు. పోలీసులతో అభిమానులు వాగ్వాదానికి దిగారు . పోలీసులకు , అభిమానులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అనుమతిని ఇవ్వాలని పోలీసులతో అభిమానులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.పోలీసులు స్వల్ప లాఠీచార్జీచేశారు.
మంగళవారంనాడు తెల్లవారుజామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ మరణించారు. కృష్ణ పార్థీవ దేహన్ని నిన్న ఉదయమే నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు. నిన్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థీవదేహనికి నివాళులర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కృష్ణ పార్థీవదేహనికి నివాళులర్పించారు.