ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బైకెలి నాగులు(55) మృతిచెందాడు.
హైదరాబాద్: ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బైకెలి నాగులు(55) మృతిచెందాడు. శనివారం రాత్రి నాగులు మృతి చెందినట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు.
తెలంగాణ శాసన సభ, మండలి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే గత గురువారం అసెంబ్లీ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్కు చెందిన బైకెలి నాగులు అనే వ్యక్తి అసెంబ్లీ ఎదుట నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో బందోబస్తులో భాగంగా అక్కడే వున్న పోలీసులు అతన్ని కాపాడి హాస్పిటల్ కు తరలించారు.
read more తెలంగాణ అసెంబ్లీ వద్ద అలజడి... నడిరోడ్డుపైనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం (వీడియో)
ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటూ అతడు పెట్రోల్ పోసుకున్నట్లు తెలిపారు. జై తెలంగాణ అంటూ నినదించడమే కాకుండా... కేసీఆర్ సర్ న్యాయం చేయమని బాధితుడు అరిచినట్టు తెలిపారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందాడు. అతడి శరీరం దాదాపు 62శాతానికి పైగా కాలిపోయింది. దీంతో మెరుగైన చికిత్స అందిస్తున్నప్పటికీ వైద్యానికి సహకరించక అతడు మృతి చెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు.