సిగ్నల్ ఇవ్వలేదు..డ్రైవర్ రైలు ఎందుకు నడిపాడో: దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో

By sivanagaprasad KodatiFirst Published Nov 11, 2019, 4:01 PM IST
Highlights

కాచిగూడ రైలు ప్రమాదం దురదృష్టకరమన్నారు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్. ప్రమాదం అనంతరం ఆయన స్పందిస్తూ.. ఈ ఘటనలో లోకో‌పైలట్‌తో పాటు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. 

కాచిగూడ రైలు ప్రమాదం దురదృష్టకరమన్నారు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్. ప్రమాదం అనంతరం ఆయన స్పందిస్తూ.. ఈ ఘటనలో లోకో‌పైలట్‌తో పాటు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులకు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని.. సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని రాకేశ్ స్పష్టం చేశారు.

ఒకే సమయంలో రెండు రైళ్లను ఒకే ట్రాక్‌పైకి వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని.. ఎంఎంటీస్ లోకో పైలట్ సిగ్నల్ ఇవ్వకుండానే రైలు ఎందుకు ముందుకు తీసుకెళ్లాడో దర్యాప్తులో తెలుస్తుందని రాకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతుందని.. స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ సమస్య లేదని సీపీఆర్వో వెల్లడించారు. 

Also Read:mmts train accident: కాచిగూడలో రెండు రైళ్ల ఢీ, 30 మందికి గాయాలు

హైదరాబాద్‌ నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రైల్వే ఏజీఎం బి.బి సింగ్  చెప్పారు.

సోమవారం నాడు ఉదయం  కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ ఇంకా రైలులోనే ఇర్రుకొన్నాడు. ఆయనను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని రైల్వే ఏజీఎం బి.బి. సింగ్ అభిప్రాయడ్డారు. ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టడంతో ఎంఎంటీఎస్ రైలులోని ఆరు బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు.లింగంపల్లి పలక్‌నుమా మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్టుగా రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

Also Read:డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: రైల్వే ఏజీఎం

మరోవైపు కేబిన్‌లో చిక్కుకొన్న ఎంఎంటీఎస్ డ్రైవర్ ను బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నట్టుగా రైల్వే అధికారులు తెలిపారు. గ్యాస్ కట్టర్ ద్వారా కేబిన్ ను కత్తిరించేందుకు  సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు.

డ్రైవర్ కేబిన్ లో చిక్కుకొన్న డ్రైవర్ కు ఆక్సిజన్ ను అందిస్తున్నట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులను ఉస్మాయా ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు తెలిపారు.

హైద్రాబాద్‌ కాచిగూడలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు సోమవారం నాడు ఉదయం ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన బోగీలు రైల్వే ట్రాక్‌పై నుండి  పక్కకు ఒరిగిపోయాయి. ఈ ఘటనలో పదిమందికి  గాయాలయ్యాయి.పలు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది.

హైద్రాబాద్‌లో కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వచ్చాయి. 

click me!