
వేములవాడ : ఈ కలికాలంలో మానవ సంబంధాలకు విలువే లేకుండా పోయింది. ధనదాహంతో కొందరు ఎంతకయినా తెగిస్తున్నారు. చివరకు నవమాసాలు కడుపున మోసిన తల్లి, అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రిని సైతం ఆస్తుల కోసం చిత్రహింసలు పెడుతున్నారు కొందరు సుపుత్రులు.ఇలాంటి కసాయి కొడుకుల చేతుల్లో తల్లిదండ్రులు బందీలయిన అమానుష ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... వేములవాడ పట్టణంలో నివాసముండే వృద్ద దంపతులను ఆస్తి కోసం కొడుకులు వేధిస్తున్నారు. ఆస్తి విషయమై తల్లిదండ్రులతో పాటు మేనల్లుడితోనూ వీళ్లు పలుమార్లు గొడవపడ్డారు. ఇలా నిన్న(మంగళవారం) కూడా తల్లిదండ్రులతో గొడవకు దిగిన కొడుకులు అమానుషంగా వ్యవహరించారు. తల్లిదండ్రుల కాళ్లు చేతులు కట్టేసి నడిరోడ్డుపై అవమానకరంగా కూర్చోబెట్టారు.
వీడియో
ఇదే సమయంలో మేనల్లుడితో మరింత దారుణంగా వ్యవహరించారు. మేనల్లుడి కాళ్లుచేతులు తాళ్లతో బంధించి ఓ స్తంభానికి కట్టేసారు. ఈ వ్యవహారంపై గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సదరు వ్యక్తులను మందలించి తల్లిదండ్రులు, మేనల్లుడి కట్లు విప్పించారు. వారిమధ్య గొడవలపై ఆరా తీసిన పోలీసులు విచారణ చేపట్టారు.