
హైదరాబాద్: Singareni ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28,29 తేదీల్లో Strike నిర్వహించాలని సింగరేణి కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఈ మేరక సింగరేణి యాజమాన్యానికి సమ్మె Notices ఇచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం సింగరేణి Coal బ్లాకులను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకొన్నాయి.ఈ నిర్ణయాన్ని సింగరేణిలో కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని కోరుతూ సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు.
గత ఏడాది డిసెంబర్ మాసంలో కూడా సింగరేణిలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. టీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సహా పలు కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి.
సింగరేణిలో నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలోనే ప్రధాని మోడీకి లేఖ రాశారు. 2021 డిసెంబర్ 6వ తేదీన కేసీఆర్ ప్రధానికి ఈ లేఖ రాశారు. కార్మిక సంఘాలు డిసెంబర్ మాసంలో కోల్ బ్లాక్ వేలాన్ని నిరసిస్తూ సమ్మెకు నిర్ణయం తీసుకొన్న సమయంలోనే కేసీఆర్ ఈ లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉందని తెలిపారు. తరువాత 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. కాబట్టి విద్యుత్ తయారు చేసేందుకు బొగ్గు సరఫరా అవసరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వేలం వేయాలని భావించిన జేబిఆర్ఓసి-3, శ్రావన్ పల్లి ఓసి, కోయగూడెం ఓసి-3 మరియు కెకె -6 యుజి బ్లాక్ ల వల్ల సింగరేణి అవసరాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి వేలం వేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.
కోల్ బ్లాక్ ల వేలాన్ని నిరసిస్తూ గతంలో కార్మిక సంఘాలు తెలంగాణలో సమ్మె నిర్వహించాయి.ఈ సమయంలో సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలతో అధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు విధులకు హాజరయ్యారు. అయితే తాజాగా ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు మరోసారి సమ్మె చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఇవాళ నోటీసులిచ్చారు.
సింగరేణి బొగ్గు గనుల బ్లాక్లను ప్రైవేటీకరించవద్దని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మిక సంఘాలుకు పార్టీలు కూడా అండగా నిలుస్తున్నాయి. సార్వత్రిక సమ్మెలో భాగంగానే ఈ నెల 28, 29 తేదీల్లో సింగరేణి కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు.
సింగరేణి బొగ్గు బ్లాకులను వేలాన్ని నిలిపివేయాలని కూడా గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను టీఆర్ఎస్, కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయ,మై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సింగరేణి విషయంలో జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. కార్మిక సంఘాలు సమ్మె నోటీసులపై సింగరేణి యాజమాన్యం ఎలా స్పందిస్తోందో చూడాలి.