- ఆత్మహత్యలకు పాల్పడుతున్న పోలీసులు
- బాసుల వేధింపులు, ఒత్తడే కారణమా?
బాసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కుకునూరు పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ మరవక ముందే... ఒత్తడి భరించలేక ఈ లోకాన్ని వదులుతున్నానంటూ ఆదిలాబాద్ జిల్లా కెరమెరిలో యువ ఎస్సై కాశమేని శ్రీధర్ సర్వీస్ రివాల్వర్ తో తనువు చాలించిన ఘటన ఇంకా కళ్ల ముందే కదలాడుతున్న వేళ.. మరో ఎస్సై అదే దారిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో ఉన్న ఓ ఎస్ఐ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీసు రివాల్వర్తో గుండెకు గురిపెట్టి మరీ తనువు చాలించాడు.
కొమురం భీమ్ జిల్లా పెంచికల్పేట్ ఎస్ఐగా ఉన్న శ్రీధర్ 2012 బ్యాచ్కు చెందిన అధికారి. ప్రధాని భద్రత కోసమే ఆయన హైదరాబాద్ వచ్చారు.
డ్యూటీలో ఉన్న ఎస్ఐ శ్రీధర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సంఘటన జరిగిన ప్రాంతంలో కూడా ఏలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. శ్రీధర్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు.
ఇంతకీ శ్రీధర్ ఆత్మహత్యకు కారణమేంటి అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
కుకునూరు పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి కూడా ప్రధాని మోదీ కోమటిబండ పర్యటన తర్వాత కొన్ని రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇప్పుడు శ్రీధర్ కూడా ప్రదాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.
విఐపి ల భద్రత సమయంలో పై అధికారుల నుంచి వచ్చే ఒత్తడి వల్ల వీళ్లు ఇలాంటి అఘాయత్యాలకు పాల్పడుతున్నారా..?
లేక మాముళ్లు పై వారికి అందించలేక, ఆ ఒత్తడి భరించలేక తనువు చాలిస్తున్నారా అనేది తెలియడం లేదు.
రామకృష్ణారెడ్డి సూసైడ్ నోట్ లో పై అధికారుల వేధింపుల గురించి స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, పోలీసులు తూతూ మంత్రంగా విచారణ జరిపి తమ వారిపై వేటు పడకుండా జాగ్రత్త పడ్డారు.
మరి ఇప్పుడు శ్రీధర్ ఆత్మహత్యపై బాసులు ఏం కారణం చెబుతారో చూడాలి.
కానీ, పోలీసు డిపార్ట్ మెంట్ లో ప్రజలకు ప్రత్యక్ష అనుబంధం ఉండేది కేవలం ఎస్సైల తోనే..వారే ఇలా ఆత్మహత్యల బాట పడడం నిజంగా కలవరపరిచే అంశమే. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.