Telugu Akademi Scam : చౌక డీజిల్ కోసం రూ.కోట్లు, ఓఆర్ఆర్ దగ్గర 35 ఎకరాలు.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు..

By AN TeluguFirst Published Oct 8, 2021, 9:46 AM IST
Highlights

అవుటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 35 ఎకరాల భూమి కొన్నానని, అది వివాదాల్లో ఉండడంతో నగదు లేదని సాయికుమార్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ నుంచి తక్కువ ధరకే డీజిల్ ఇస్తామంటే ఓ డీలర్ కు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానని అతడు కనిపించకుండా పోయాడని వివరించినట్లు సమాచారం.  

హైదరాబాద్ : తెలుగు అకాడమీ నిధులను ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించి రూ. 64.05 కోట్లు కొల్లగొట్టిన ఘరానా నిందితులు వాటిని ఎప్పుడు, ఎలా సొంతానికి వాడుకున్నారు అనే  అంశాలను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు సేకరించారు.  గోల్మాల్ సూత్రధారి సాయికుమార్ రూ. 20 కోట్లు తీసుకోగా ఏపీ మర్కంటైల్ సహకార క్రెడిట్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణరావు రూ.10 కోట్లు కమీషన్ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది.

అవుటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 35 ఎకరాల భూమి కొన్నానని, అది వివాదాల్లో ఉండడంతో నగదు లేదని సాయికుమార్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ నుంచి తక్కువ ధరకే డీజిల్ ఇస్తామంటే ఓ డీలర్ కు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానని అతడు కనిపించకుండా పోయాడని వివరించినట్లు సమాచారం.  

కమీషన్లు తీసుకొని ఆ సొమ్ముతో ప్లాట్లు కొన్నామని, కొంత నగదు ఉందని వెనక్కి ఇచ్చేస్తామని చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ,  కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన చెప్పినట్లు తెలిసింది. తాను సత్తుపల్లిలో ఓ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నానని ఇందుకోసం డబ్బు వాడేశానని మరో నిందితుడు డాక్టర్ వెంకట్ చెప్పినట్లు తెలిసింది.

కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన  భర్త  బాబ్జీ సహా మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో  గాలిస్తున్నాయని  సంయుక్త కమిషనర్ ( నేర పరిశోధన)  అవినాష్ మహంతి చెప్పారు.  తాజాగా ఈ telugu akademi scamపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది.

కలర్ జిరాక్స్ ల  పద్మనాభన్  అరెస్ట్..
ఫిక్స్డ్ డిపాజిట్లను కలర్ జిరాక్స్ లు తీసి వాటిని అకాడమీ అధికారులకు ఇచ్చిన చెన్నైవాసి పద్మనాభన్ ను సిసిఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.  కోయంబత్తూర్ లోని ఓ హోటల్ లో పద్మనాభన్ ఉండగా   ఏసిపి  మనోజ్ కుమార్ బృందం అతడిని పట్టుకుంది. 

telugu academy scam: రూ.64 కోట్లలో ఎవరెంత పంచుకున్నారంటే.. సూత్రధారులు వీరే

బలమైన నెట్వర్క్.. ఉమ్మడి కార్యాచరణ..

ప్రభుత్వ శాఖల్లోని నిధులను వేరే బ్యాంకు లో Fixed deposits చేయించి వాటిని కొల్లగొట్టేందుకు సాయికుమార్ ఒక బలమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాడని సిసిఎస్ పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించారు.  పదేళ్ల క్రితం అతడికి నండూరి వెంకట రమణ( తణుకు, ఏపీ),  రాజ్ కుమార్( ధర్మవరం, ఏపీ) పరిచయమయ్యారు.  మైనార్టీ కార్పొరేషన్, ఏపీ హౌసింగ్ బోర్డు,  కాలుష్య నియంత్రణ మండలి లకు చెందిన  Fixed deposit scamలో  సాయి కుమార్ కు  వీరు వెన్నంటి ఉన్నారు.

ఫలానా ప్రభుత్వ శాఖలో  నిధులు కొట్టేద్దామని  పథకం  సిద్ధం చేసుకున్నాక అధికారులు,  బ్యాంకు మేనేజర్లను ఎంపిక చేసుకుంటున్నారు.  వారిని ప్రభావితం చేసే వ్యక్తులను కలుసుకుని నిధులు కొట్టేద్దాం..  అంటూ ప్రణాళిక వివరిస్తారు.  ఆ తరువాత కొంత మంది వ్యక్తులను నియమించుకుని ఉమ్మడిగా పనులు పూర్తి చేస్తున్నారు. 

click me!