రూ. 40 కోట్ల భూ వివాదం: సమాధానం ఇవ్వని ఎమ్మార్వో సుజాత

By telugu teamFirst Published Jun 8, 2020, 4:41 PM IST
Highlights

హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని రూ.40 కోట్ల భూవివాదానికి సంబంధించి ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తన నివాసంలో పట్టుబడిన రూ.30 లక్షలపై ఎమ్మార్వో సుజాత స్పష్టత ఇవ్వడం లేదు.

హైదరాబాద్: హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని భూవివాదానికి సంబంధించి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం నుంచి షేక్ పేట ఎమ్మార్వో సుజాతను తమ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆమె నివాసంలో దొరికిన రూ.30 లక్షలపై సుజాత సరైన సమాధానం ఇవ్వడం లేదని సమాచారం.

సోదాల సమయంలో ఏసీబీ అధికారులకు సుజాత నివాసంలో రూ.30 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ డబ్బులు ఎక్కడివనే విషయంపై సుజాత స్పష్టత ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆమె స్పష్టత ఇవ్వకపోతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఆమెపై నమోదు చేసే అవకాశం ఉంది.  

Also Read: షేక్ పేట భూ వ్యవహారం.... బయటపడుతున్న ఎమ్మార్వో సుజాత అక్రమాలు

బంజారాహిల్స్ లోని రూ.40 కోట్ల విలువ చేసే బంజారాహిల్స్ భూమి వివాదంలో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఆర్ఐ నాగార్జున రెడ్డి ఎసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆయన ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలని ఎసీబీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో పోలీసు అధఘికారి రవీంద్రనాయక్ ను కూడా ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు. 

గత మూడు రోజులుగా సుజాతను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సుజాత భర్త వాంగ్మూలాన్ని, వీఆర్వో వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసు, రెవెన్యూ అధికారులతో పాటు ఇంకా ఎవరి పాత్రనైనా ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

click me!