
సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీహెచ్వీఎం కృష్ణారావు (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. 47 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జర్నలిజం రంగంలో కొనసాగడం.. ఈ రంగంపై ఆయనకు ఉన్న అచంచలమైన అంకితభావానికి నిదర్శనం. ఇక, కృష్ణారావు 1975లో ఒక స్టింగర్గా జర్నలిజం కేరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా ఈ రంగంలో రాణించారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్తో సహా.. ఆంగ్ల, తెలుగు దినపత్రికలపై చెరగని ముద్ర వేశారు. డెక్కన్ క్రానికల్లో న్యూస్ బ్యూరో చీఫ్గా ఆయన పనిచేశారు. అక్కడ ఆయన 18 ఏళ్లకు పైగా పనిచేశారు.
కృష్ణారావు తన ప్రియమైన వారిచే "బాబాయ్" అని ముద్దుగా పిలిపించుకునేవారు. జర్నలిజయంలో నిశితమైన అంతర్దృష్టి ఆయనకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు మనుమలు ఉన్నారు. అయితే ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు.
కృష్ణారావు మృతిపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘సన్నిహితులు ప్రేమగా 'బాబాయ్' అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు సీహెచ్వీఎం కృష్ణారావు గారి మృతి బాధాకరం. కృష్ణారావు 47 ఏళ్లుగా పత్రిక రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి, జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.