
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం కేసులో నిందితునిగా ఉన్న సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే స్టేషన్లో విధ్వంసం కేసుతో తనకు సంబంధం లేదని ఆవుల సుబ్బారావు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్మీలో సేవ చేసి.. అదే స్పూర్తితో యువత సైన్యంలో చేరాలని ప్రోత్సహించినట్టుగా పేర్కొన్నారు. పోలీసులు తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇక, ఈ కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బరావు పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో సుబ్బరావును ప్రధాన కుట్రదారుగా తేల్చారు.
ఈ క్రమంలోనే సుబ్బారావుతో పాటు అతని అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. వారిని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు సుబ్బరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు తరలించారు. సుబ్బారావుతో పాటు అతని అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలకు కూడా కోర్టు రిమాండ్ విధించింది.
‘‘సంఘటన జరగడానికి ఒకరోజు ముందు, సుబ్బారావు మరియు అతని సహచరులు అనేక వాట్సాప్ గ్రూపులను సృష్టించారు. ఉద్యోగ అభ్యర్థులను సికింద్రాబాద్కు రావాలని కోరారు. ఆయన కూడా నర్సరావుపేట నుంచి వచ్చి ఇక్కడే ఓ లాడ్జిలో బస చేశారు. నగరానికి వచ్చిన అభ్యర్థులకు సుబ్బారావు భోజనం, ప్రయాణ ఏర్పాట్లు చేశారు. సుబ్బారావు అనుచరులు.. తొలుత నిరసన చేపట్టేలా ఉద్యోగ ఔత్సాహికులతో సమన్వయం చేసి, ఆ తర్వాత హింసను ఆశ్రయించేలా వారిని ప్రేరేపించారు. అయితే.. రైల్వే స్టేషన్లో హింస ప్రారంభమైన వెంటనే అతను తన స్వగ్రామానికి పారిపోయాడు’’ సికింద్రాబాద్ GRP పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.