సైదాబాద్ రేప్, హత్య కేసులో పోలీసులు నిందితుడు రాజు కోసం అతని అత్తగారి ఊరిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల క్రమంలో పోలీసులకు రాజు గురించి మరిన్ని విస్తుపోయే విషయాలు తెలిశాయి.
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైదాబాదు సింగరేణి కాలనీలో జరిగిన ఆరేళ్ల పాపపై రేప్, ఆమె హత్య కేసులో నిందితుడు రాజు పైశాచికత్వం మరింతగా వెలుగు చూస్తోంది. పోలీసులు అతని అత్తగారి ఊరిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అతని దారుణాలు మరిన్ని వెలుగు చూస్తున్నాయి.
నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు అతని అత్గారి ఊరు సూర్యాపేట జిల్లాలోని జలాల్ పురంలోనూ పరిసర ప్రాంతాల్లోనూ బుధవారం గాలింపు చేపట్టారు. అతనితో సంబధం ఉన్నవారిని ప్రశ్నించారు. రాజు భార్య ప్రసవం కోసం ఏడాది కిందట పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది.
Also Read: సైదాబాద్ ఘటనను నిరసిస్తూ వైఎస్ షర్మిల దీక్ష.. భగ్నం చేసిన పోలీసులు..!
ఈ క్రమంలో రాజు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడని, రెండు వారాల క్రితం వచ్చి ఇక్కడ కూలి పనులు కూడా చేశాడని చెబుతున్నారు. తాగిన మత్తులో ఓ రోజు అత్తపై కూడా దాడి చేశాడని చెబుతున్నారు. మత్తు దిగిన తర్వాత తనపై దాడి చేస్తారని భయపడి హైదరాబాదుకు తిరిగి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.
Also Read: సైదాబాద్ హత్యాచారం కేసు.. రాజు కోసం వేట, మద్యం దుకాణాలు, కల్లు కాంపాండ్లే టార్గెట్: డీజీపీ
తాగి మత్తులో కూతురిని కూడా చంపడానికి రాజు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. రాజుకు గంజాయి సేవించడంతో పాటు మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైదాబాదులోని సింగరేణి కాలనీలో నేరం జరిగి ఇప్పటి వారం రోజులు అవుతోంది. ఇప్పటి వరకు పోలీసులు రాజును పట్టుకోలేకపోయారు.
ఇదిలా వుంటే, మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించారు. కుటుంబానికి మంత్రులు ఆర్థిక సాయం అందించారు. మంత్రుల చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారిని మంత్రులు ఓదార్చారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.