Russia Ukraine Crisis: బంకర్లో నుండే మంత్రితో వీడియో కాల్... తెలుగు విద్యార్థి దీన స్థితి...

Arun Kumar P   | Asianet News
Published : Feb 27, 2022, 02:12 PM ISTUpdated : Feb 27, 2022, 02:17 PM IST
Russia Ukraine Crisis: బంకర్లో నుండే మంత్రితో వీడియో కాల్... తెలుగు విద్యార్థి దీన స్థితి...

సారాంశం

ఉన్నతచదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లిన ఓ మెడిసిన్ విద్యార్థి యుద్దవాతావరణంలో చిక్కుకుని ఓ బంకర్లో వుండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో వీడియో కాల్ మాట్లాడాడు. దీన్నిబట్టే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా వుందో అర్థం చేసుకోవచ్చు. 

నిర్మల్: రష్యా (russia) సైనిక దాడితో ఉక్రెయిన్ (ukraine) లో భయానక పరిస్థితి నెలకొంది. బాంబుల వర్షం, తుపాకుల మోతతో రష్యా సైనికులు ఉక్రెయిన్ పై విరుచుకుపడటంతో ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉక్రెయిన్ ప్రజలతో సహా విద్యా, ఉపాధి కోసం వెళ్లిన భారతీయులను సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంభయంతో బ్రతకాల్సి వస్తోంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే కొందరిని ఉక్రెయిన్ నుండి ఇండియాకు తీసుకురాగా ఇంకా చాలామంది అక్కడే యుద్దవాతావరణ మద్య భయంభయంగా గడుపుతున్నారు. ఇలా ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఓ తెలుగు విద్యార్థితో మాట్లాడిన తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (alolla indrakaran reddy) ధైర్యం చెప్పాడు. 

నిర్మల్ (nirmal) పట్టణం బుధవార్ పేట్ కు చెందిన వైద్య విద్యార్థి సాయికృష్ణ ఉన్నతచదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. ఇప్పుడు ఆ దేశంలో యుద్దవాతావరణం నెలకొనడంతో సాయికృష్ణ యోగక్షేమాలు తెలుసుకునేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ(ఆదివారం) నిర్మల్ లోని అతడి ఇంటికి వెళ్లారు. 

ఈ క్రమంలోనే సాయికృష్ణ కుటుంబసభ్యులకు మంత్రి ధైర్యం చెప్పారు. అనంతరం స్వయంగా మంత్రే ఉక్రెయిన్ లో చిక్కుకున్న సాయికృష్ణకు వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. అయితే తాను నివాసముండే ప్రాంతంలో కూడా దాడులు జరుగుతుంటంతో ఓ బంకర్ లో తలదాచుకున్నట్లు... అక్కడినుండే ఈ వీడియో కాల్ కూడా మాట్లాడుతున్న సాయికృష్ణ తెలిపారు. దీంతో మంత్రి అతడికి ధైర్యం చెప్పి వెంటనే స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చే అన్ని చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. 

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను కాపాడేందుకు ప్రభుత్వం తన వంతు కృషిచేస్తోందన్నారు. తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖను కోరినట్లు... ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని మంత్రి పేర్కొన్నారు. కాబట్టి సాయికృష్ణతో పాటు అక్కడ చిక్కుకున్న మిగతా విద్యార్థులు, ఇండియాలో వుండి కంగారుపడుతున్న తల్లిదండ్రులు దైర్యంగా వుండాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.

ఇదిలావుంటే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలను వేగవంతం చేసింది భారత సర్కార్. ఇప్పటికే ఎయిరిండియా (air india flight) విమానం బుకారెస్ట్ నుంచి 219 మంది భారతీయలుతో శనివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఇక రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయలుదేరిన రెండో విమానం ఆదివారం తెల్లవారుజామున డిల్లీ చేరుకుంది. ఇందులో 250 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు.  

ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులతో కూడిన మూడో విమానం కూడా స్వదేశానికి చేరుకుంది. హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఇందులో మొత్తం 240 మంది ఇండియన్స్ ఉన్నారు. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలైన తర్వాత భారత్ స్వదేశానికి తరలించిన భారతీయుల సంఖ్య 709కి చేరింది.

PREV
click me!

Recommended Stories

Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu
Viral News: కింగ్‌ఫిష‌ర్ బీర్ బాటిల్‌లో చేప పిల్ల‌.. వార్త‌ల‌పై స్పందించిన కంపెనీ. ఏమన్నారంటే.?