కరీంనగర్ నుండి ఆర్మూర్ కు వెళుతున్న ట్యాంకర్ ను వెనక నుండి వేగంగా వచ్చిన ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసి బస్సు ఓ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. ట్యాంకర్ కరీంనగర్ నుండి ఆర్మూర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆర్టిసి బస్సు-ట్యాంకర్ జాతీయ రహదారి 63పై ఢీకొన్నాయి. రెండు వాహనాలు బలంగా గుద్దుకోవడంతో ధ్వంసమయ్యాయి. బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. బస్సు వేగంగా వచ్చి ట్యాంకర్ ను వెనకవైపు నుండి ఢీ కొట్టింది.
రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి ఆ తర్వాత ప్రమాదం కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.