
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవని కేసీఆర్ చెబుతున్న పేపర్ క్లిపింగ్ను ట్విట్టర్లో షేర్ చేసిన రేవంత్ రెడ్డి.. పచ్చి అబద్దాన్ని కూడా నిజం అనిపించేలా చెప్పడంలో కేసీఆర్ను మించినోడు లేడని విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవన్న కేసీఆర్ వ్యాఖ్యల్లో నిజమెంతో నిగ్గు తేల్చుదామన్న రేవంత్.. చర్చకు సిద్దమా? అంటూ సవాలు విసిరారు.
‘‘ఒకటైతే నిజం… పచ్చి అబద్ధాన్ని కూడా ఇదే నిజం అనిపించేలా చెప్పడంలో నిన్ను మించినోడు లేడు కేసీఆర్!. తెలంగాణలో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న లెక్కలు ఎన్సీఆర్బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. లెక్కకు రానివి ఇంతకు పదింతలు. రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో ఇద్దరం కూర్చుందాం… ఆత్మహత్యలు లేవన్న నీ మాటల్లో నిజమెంతో నిగ్గుతేల్చుదాం. కేసీఆర్…సిద్ధమా?!’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఇక, తెలంగాణ భవన్లో శనివారం మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అటు పోట్లు చూశానని చెప్పారు. తన రాజకీయ జీవితమమంతా పోరాటలేనని అన్నారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లేకుండా ఉండదని అన్నారు.
పరిష్కారం లేని సమస్యలు ఉండవని.. గెలుపుకోసం కృషి చేయాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నారు. రైతుల పోరాటం న్యాయమైనదని అన్నారు. గెలవాలంటే చిత్తశుద్దితో ఉండాలి.. తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. రైతుల పోరాటంపై ప్రధాని మోదీ కనీసం సానుభూతి చూపలేదని విమర్శించారు. రైతులను ఖలీస్తానీలు, ఉగ్రవాదులు, వేర్పాటువాదులు అంటూ నిందలు వేశారని మండిపడ్డారు. 750 మంది రైతులు చనిపోతే మోదీ స్పందించలేదని అన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు లేకుంటే 3 నల్లా చట్టాలను రద్దు చేసేవారు కాదని విమర్శించారు. ఆ ఎన్నికల కోసమే ప్రధాని మోదీ తియ్యటి మాటలు చెప్పారని అన్నారు. రైతుల పోరాటం వల్లే కేంద్రం 3 నల్లా చట్టాలను రద్దు చేసిందని అన్నారు.
తెలంగాణ వచ్చాక ఇక్కడ రైతుల సమస్యలను పరిష్కరించుకున్నామని చెప్పారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పారు. తెలంగాణలో ఏం చేశామో మీరంతా ఒకసారి చూడాలని మహారాష్ట్ర నేతలతో అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు. దేశం అంతా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. రైతులు ఇంకా ఎంతకాలం గిట్టుబాటు ధర కోసం పోరాడాలని ప్రశ్నించారు.