మంత్రి జగదీశ్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతోందా... అవుననే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఆ అనుమానాలు తలెత్తడానికి ఏడాది క్రితం జరిగిన ఓ సంఘటనను ఎత్తి చూపుతున్నారు.
సూర్యాపేట: తెలంగాణ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి హత్యకు రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఓ వాహనంలో 2వన మంత్రి స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నాగారం వచ్చినట్లు డ్రోన్తో గ్రామ వీధులు, డొంక రోడ్లను చిత్రీకరించినట్లు గ్రామస్థులు చెబుతున్నారని వార్తలు వచ్చాయి.
రెక్కీ నిర్వహించినది ప్రగతి నివేదన సభ జరిగిన 2వ తేదీన అని కొంత మంది, ఆగస్టు 30న అని మరికొందరు చెబుతున్నారు. ఆగస్టు 30వ తేదీన జగదీశ్ రెడ్డి ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి నాగారం వచ్చారు. ఆయన నాగారంలో సెక్యూరిటీ లేకుండానే గ్రామస్తులతో కలిసిపోతారు. సన్నిహితుల ఇళ్లకు, పొలం వద్దకూ వెళుతుంటారు.
అలాంటి సయమంలో ఆయనపై దాడి చేయాలని కుట్ర చేసినట్లు చెబుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏడాది క్రితం ఆయన సూర్యాపేటకు వస్తుండగా ఎర్రసానిగూడెం వద్ద అకస్మాత్తుగా ఓ వ్యాన్ కాన్వాయ్లోకి వచ్చి ప్రోటోకాల్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ వాహనం కనిపించకుండా పోయింది. రెక్కీ నిర్వహించినట్లు సమాచారం ఉందని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు చెప్పారు.