
సీఎం కేసీఆర్ (cm kcr)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congres MLA) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati reddy Rajgopal reddy)పై పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Jeevan reddy) తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ (assembly) ఆవరణలో ని మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి ఒక కుసంస్కారి అని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియడం లేదని అన్నారు. ఆయనకు చిన్న మెదడు చితికిపోయి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనరల్ హెల్త్ చెకప్ కోసం సీఎం కేసీఆర్ దవాఖానకు వెళ్లారని, కానీ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి ఆసుపత్రికి పోయారని అనడం సిగ్గు చేటని తెలిపారు. ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ (congress), బీజేపీ (bjp)లు గెలిస్తే తమకేంటని, ఓడితే తమకేంటని అన్నారు. ఆ రెండు పార్టీలు కట్టగట్టుకొని ఎక్కడైనా దూకి చస్తే తమకేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ది మామూలు గుండె కాదని, కోట్లాది మంది అభిమానం ప్రజల అభిమానం పొందిన గుండెని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ లను మట్టి కరిపించిన ఉక్కు గుండె అని కొనియాడారు. సీఎం కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్ళితేనే యావత్ తెలంగాణ తల్లడిల్లిందని తెలిపారు. సీఎం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోట్లాది మంది ప్రజలు దేవుడిని ప్రార్ధించారని చెప్పారు
ప్రజలందరూ సీఎం బాగు కోరుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహించే మునుగోడు నియోజకవర్గంలో కూడా 95 శాతం మంది కేసీఆర్ అభిమానులున్నారని తెలిపారు. రైతులు, దళితులు, మైనారిటీ లు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారూ కేసీఆర్ అభిమానులేనని అన్నారు.
రాజగోపాల్ రెడ్డి చిల్లర రాజకీయాల కోసం కేసీఆర్ పై నోరు పారేసుకుంటే ఆయన సంగతి చూస్తామని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని పూర్తి చేసి విద్యా, వైద్య రంగాలను సంస్కరించి హరిత, నీలి, క్షీర, పింక్ విప్లవాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణయుగం తెచ్చారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కు ముందు, కేసీఆర్ తరువాత అని చూడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. కేసీఆర్ దార్శకనిత ను స్కూల్ పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు తెలిసే విధంగా చేయాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు.