Rain damage: వరదలు, వర్షాలతో భారీ నష్టం.. తెలంగాణ‌కు రానున్న కేంద్ర బృందం

Published : Jul 30, 2023, 12:06 PM IST
Rain damage: వరదలు, వర్షాలతో భారీ నష్టం..  తెలంగాణ‌కు రానున్న కేంద్ర బృందం

సారాంశం

Hyderabad: భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తిన తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించనుంది. భారీ వర్షాలు-వరదల కారణంగా జరిగిన నష్టాన్ని ఈ బృందం అక్కడికక్కడే అంచనా వేస్తుందని అధికారులు తెలిపారు. ఈ బృందంలో వ్యవసాయం, జల్ శక్తి , ఫైనాన్స్, పవర్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ & హైవేస్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (NRSA) అధికారులు ఉంటారు.  

Telangana Rain damage: జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని అంతర్-మంత్రిత్వ శాఖ బృందం  సోమవారం నుండి రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పంట నష్టాలను అంచనా వేయనుంది. భారీ వర్షాలు-వరదల కారణంగా జరిగిన నష్టాన్ని ఈ బృందం అక్కడికక్కడే అంచనా వేస్తుందని అధికారులు తెలిపారు. ఈ బృందంలో వ్యవసాయం, జల్ శక్తి , ఫైనాన్స్, పవర్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ & హైవేస్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (NRSA) అధికారులు ఉంటారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృందం (ఐఎంసీటీ) ఈ నెల 31న తెలంగాణలో పర్యటించనుంది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని ఈ బృందంలో వ్యవసాయం, ఆర్థిక, జలశక్తి, విద్యుత్, రోడ్డు రవాణా, రహదారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) మంత్రిత్వ శాఖలు/ విభాగాల ప్రతినిధులు ఉంటారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

గత వారం రోజులుగా తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్ర‌స్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నిలిచిపోవడంతో సహాయక చర్యలు శనివారం వేగం పుంజుకున్నాయి. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారితో మాట్లాడి సహాయక చర్యలను సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31 నుంచి కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. ఐఎంసీటీ పర్యటన ఆధారంగా నష్టాన్ని అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర వినతిపత్రం సమర్పించిన తర్వాత కేంద్ర బృందం రెండోసారి రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుల ప్రతినిధి బృందంతో కలిసి, తీవ్రమైన వరద పరిస్థితిని ఆయనకు వివరించార‌ని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల   పౌర జీవనం స్తంభించింది, పంటలు దెబ్బతిన్నాయి, రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. నష్టాన్ని అంచనా వేయడానికి వెంటనే ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపాలని హోం శాఖ కార్యదర్శిని అమిత్ షా ఆదేశించారని పేర్కొన్నారు.

కాగా, గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు పంట పొలాలు దెబ్బతిన్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆగస్టు 1న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్‌బాగ్‌ బంగ్లా అసలు కథ ఇదే..!
KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu