పెట్రోల్ బంకులు బంద్.. హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో కొనసాగుతున్న నిరసనలు

Published : Aug 24, 2022, 02:37 PM IST
పెట్రోల్ బంకులు బంద్.. హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో కొనసాగుతున్న నిరసనలు

సారాంశం

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇంకా నిరసనలు కొనసాగుతుండటంతో  పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పెట్రోల్ బంకులను మూసివేశారు.   

హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే  సస్పెన్షన్‌కు గురైన రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నందున నగర పోలీసులు బుధవారం పాతబ‌స్తీలోని అన్ని పెట్రోల్ పంపులను మూసివేశారు. భారతీయ పురావస్తు శాఖ (ASI)  అధికారులు మీడియాతో మాట్లాడుతూ..  చార్మినార్ సందర్శకుల కోసం తెరిచి ఉంచబడిందని, అయితే ఏదైనా పెద్ద నిరసన లేదా ప‌రిస్థితులు దిగ‌జారే విధంగా ఉంటే మూసివేయబడుతుందని స్పష్టం చేశారు.

సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా మంగళవారం జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన ఉద్రిక్త‌ప‌రిస్థితుల మ‌ధ్య‌ వాగ్వివాదంలో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌తో సహా నలుగురు గాయపడ్డారు. మహ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు రాత్రంతా అనేక ర్యాలీలు నిర్వహించారు. శాలిబండలో భారీ ర్యాలీ జరిగింది. గోషామహల్‌కు చేరుకోవడానికి ప్రయత్నించిన కొద్దిమంది ముస్లిం నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిపై లాఠీచార్జీ చేసిన‌ట్టు స‌మాచారం. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన రాజా సింగ్‌కు మంగళవారం బెయిల్ రావడంతో నిరసనలు చెలరేగాయి. ఓల్డ్ సిటీలో బుధవారం రాత్రి అంతటా ముస్లిం యువకుల సమూహాలు నిరసన ర్యాలీలు కొనసాగించాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కొందరు గోషామహల్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.

పరిస్థితిని అదుపు చేసేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్‌కు చెందిన పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహ‌రించారు. మంగళవారం రాత్రి, సీనియర్ పోలీసు అధికారులు కూడా యువకులు గోషామహల్‌కు చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు ముస్సలాం జంగ్ వంతెన నుండి వెనక్కి వచ్చేలా వారిని ఒప్పించారు. రాజా సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నిరసనకారులు రెండు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. జంక్షన్‌లోని రాజేష్‌ మెడికల్‌ హాల్‌ సమీపంలోని శాలిబండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పలు చోట్ల రాజాసింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. గోషామహల్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు మంగళవారం పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

కాగా, అంత‌కుముందు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్ విడుద‌ల చేసిన ఒక వీడియోలో ముస్లింలు, ప్రవక్త ముహమ్మద్‌పై అనేక అవమానకరమైన.. వివాదాస్ప‌ద వ్యాఖ్యలను చేశారు. ఈ క్ర‌మంలోనే సోమవారం రాత్రి నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ కార్యాలయం వెలుపల ఆగ్రహించిన యువకులు ఆయ‌న‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేయడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇది మంగళవారం కూడా కొనసాగి బెయిల్‌పై విడుదలైన తర్వాత తీవ్రరూపం దాల్చింది. తమ పార్టీ అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవిస్తుందని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి  కృష్ణసాగర్‌రావు చెప్పిన‌ట్టు సియాసత్ నివేదించింది. "మాది జాతీయ పార్టీ.. మేము రాజా సింగ్ ప్రకటనలు లేదా ద్వేషపూరిత ప్రసంగాలకు మద్దతు ఇవ్వము" అని అయ‌న పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu