
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లోకి వలసలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్లోకి చేరడం లాంఛనమే అయిన తరుణంలో ఈ పార్టీలోకి చేరికలు వీరితో ఆరంభం మాత్రమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణ కాంగ్రెస్లోకి ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చేరుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా చేసిన తుమ్మల పాపిరెడ్డి రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నేరుగా కాంగ్రెస్లోకి చేరుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ దొందూ దొందే అని తాను భావిస్తున్నానని, అందుకే కాంగ్రెస్లో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
బీఆర్ఎస్ తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు జరుపుతుండగా.. కాంగ్రెస్ నిన్న దశాబ్ది దగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమంలో తుమ్మల పాపిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ాయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని, అందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు.
ఆదిలాబాద్కు చెందిన తుమ్మల పాపిరెడ్డి కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా చేశారు. ఆయన వరంగల్లోనే స్థిరపడ్డారు. తెలంగాణ మలి ఉద్యమ సమయంలో ఆయన వరంగల్ జిల్లా తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్గా పని చేశారు.
Also Read: ‘అసంతృప్త నేతలు’ ఈటల, రాజగోపాల్కు అధిష్టానం పిలుపు.. గుడ్ న్యూస్ చెబుతారా? బుజ్జగింపులేనా?
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ తుమ్మల పాపిరెడ్డిని 2014లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియామకం చేశారు. 2021లో ఆ పదవి నుంచి పాపిరెడ్డి వైదొలిగారు. తాజాగా, రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన రాజకీయాలకు కాంగ్రెస్ను వేదికగా మలుచుకుంటున్నారు.