
ఉద్యమాన్ని పుట్టించిన పార్టీకి... ఉద్యమ సంస్థకు మధ్య మొదలైన కోల్డ్ వార్ ఇప్పుడు అసలుసిసలు వార్ గా మారింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీ జేఏసీ నిర్వహించిన పాత్ర మరవలేనిది. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ పునర్ నిర్మాణం కోసం తన వాణిని గట్టిగా వినిపిస్తూనే ఉంది.
అధికార పార్టీ... జేఏసీ లోని కొంతమంది నేతలను తన వైపు తిప్పుకొని నీరుగార్చే ప్రయత్నం చేసినా ఆ పాచికలేవి పారడం లేదు. పైపెచ్చు ఉద్యమసమయంలో పాలు,నీళ్లు లా కలిసిపోయినా టీజేఏసీ, టీఆర్ఎస్ కు మధ్య ఇటీవల మాటల యుద్ధం పెరుగుతోంది.
ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టేందుకు టీ జేఏసీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా పూర్తి చేసింది.
సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తన వాణిని బలంగా వినిపించేందుకు వీలుగా సొంతంగా వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది.
లక్ష ఉద్యోగాల హామీ ఇంకా అమలు కాని నేపథ్యంలో నిరుద్యోగులు నిరాశనిసృహలతో ఉన్నారు. వారి ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ నెల 22 న నిరసన ర్యాలీ ని కూడా చేపడుతోంది.
అయితే తెలంగాణ పునర్ నిర్మాణంపై ప్రశ్నిస్తున్న రాజకీయ జేఏసీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు పన్నుతోందని ఆరోపణలొస్తున్నాయి. జేఏసీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు పోలీసులను వారిపై ఉసిగొల్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మొన్న భక్త రామదాసు ప్రాజెక్టు సందర్భంగా సీఎం ఖమ్మం వచ్చారు. ఆ నేపథ్యంలో అక్కడి జేఏసీ నేతలను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. వారేమీ ప్రతిపక్ష పార్టీ నేతలు కాదు... సంఘ విద్రోహ శక్తుల అంతకంటే కాదు.. అంతకుముందు కూడా టీ జేఏసీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం కాస్త ఘాటుగానే స్పందించారు. నిన్న నాంపల్లిలో జేఏసీ నేతలతో జరిగిన చర్చల అనంతరం ఆయన ఈ అంశంపై నే ఎక్కువగా మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులకు భయపడలేదని అలా భయపడితే ఉద్యమం ఎందుకు చేసేవారమని గుర్తు చేశారు.
తమ నేతలు, కార్యకర్తలను పొలీసులు తీవ్రంగా వేధిస్తున్నారని, అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పోలీసుల వేధింపులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు జేఏసీ నేతలపై ఎలాంటి ఆరోపణలు లేవు. నిర్మాణాత్మకంగా ప్రభుత్వ పనితీరుపైనే వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే ప్రజల నుంచి టీ జేఏసీకి ప్రతిఘటన ఎదురు కావడం లేదు.
ఈ నేపథ్యంలో పోలీసులు మరింత తీవ్రస్థాయిలో టీ జేఏసీ నేతలను వేధిస్తే అది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే పోలీసుల వేధింపులకు ప్రొఫెసర్ డోంట్ కేర్ అంటున్నారు. పరోక్షంగా ‘కారు’ కే ఆయన వార్నింగ్ ఇస్తున్నారు.