
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ పర్యటనకు రానున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ సరూర్నగర్ నిరుద్యోగ సమస్యలపై నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరగనుంది. అయితే అక్కడ 8వ తేదీ సాయంత్రం ప్రచారం ముగియనుంది. దీంతో ఆ రోజు సాయంత్రం ప్రియాంక గాంధీ కర్ణాటకలో ప్రచారం ముగించుకుని.. నేరుగా హైదరాబాద్కు రానున్నట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నారు.
సరూర్నగర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆమె కేంద్రంలోని అధికార బీజేపీతో పాటు రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యువత కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో కూడా ఈ సభ వేదికపై నుంచి ప్రియాంక గాంధీ వివరిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
ఇక, ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పుడు ప్రియాంక గాంధీ తెలంగాణకు రావడం పార్టీ శ్రేణులను ఎన్నికల మూడ్లోకి వెళ్లేలా చేస్తుందని టీపీసీసీ భావిస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రియాంక గాంధీ పర్యటన, ఇతర అంశాలను చర్చించేందుకు టీపీసీసీ పీఏసీ ఈరోజు ఉదయం జూమ్ ద్వారా సమావేశమైంది. ఈ సమావేశానికి టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.