టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డికి పదవిని కట్టబెట్టడంపై కొందరు పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డికి పదవిని కట్టబెట్టడంపై కొందరు పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుండి కొనసాగుతున్న వారిని కాదని రేవంత్ రెడ్డికి పదవి కట్టబెట్టడంపై ఆగ్రహంతో ఉన్నారు. కొందరు నేతలైతే తీవ్ర నిర్ణయం తీసుకొంటామని కూడ ప్రకటించారు.
టీడీపీని వీడి రేవంత్ రెడ్డి గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో రేవంత్ రెడ్డి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తాజాగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది.ఈ పదవిని కట్టబెట్టడంపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్టీ జెండాను ఇంత కాలం పాటు భుజాన మోసిన వారిని కాదని నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెట్టడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కమిటీ కూర్పు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను తన రాజకీయ భవితవ్యంపై తీవ్ర నిర్ణయం తీసుకొంటానని మీడియాకు చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉండి.. మాజీ మంత్రులుగా ఉన్న వారికి అనుబంధ విభాగాల్లో చోటు దక్కింది. కానీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం దక్కలేదు. బీసీ సామాజికవర్గం నుండి పొన్నం ప్రభాకర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లభించింది
ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మల్లు భట్టివిక్రమార్కను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుండి తప్పించడంపై కొందరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ కు ఈ పదవి దక్కిందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ కమిటీ కూర్పుపై పార్టీ నేతలు ఇంకా ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూడాలి
సంబంధిత వార్తలు
కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్రెడ్డికి మూడు కమిటీల్లో చోటు