
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితమని టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే ముందు .. కేటీఆర్కు వ్యవసాయం గురించి ఏం తెలుసో చెప్పాలని ప్రశ్నించారు. ఒక వేలు రాహుల్ గాంధీ వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు కేటీఆర్ వైపు చూపిస్తాయని అన్నారు.
రాహుల్ గాంధీకి అపారమైన విషయ పరిజ్ఞానం ఉందని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో భాగంగా దేశంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో క్యాప్సికమ్ పంటకు కోట్లు సంపాదించామని చెబుతున్నారని.. మరి రాష్ట్రంలో రైతులకు ఆ ఫార్ములా ఏంటనేది ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం, కేటీఆర్కు మంత్రి పదవి సోనియా గాంధీ పెట్టిన భిక్ష అని అన్నారు.
సీఎం కేసీఆర్ ఓ మాయల మరాఠీ అని విమర్శలు గుప్పించారు. ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందని చెప్పారు. వైఎస్సార్ హయాంలో ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరిస్తున్నారని.. బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ పదవి ఇచ్చినందుకు అధిష్టానానికి, పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో అందరిని కలుపుకుని వెళ్తానని చెప్పారు.