
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్ధి నవీన్ హత్య కేసుకు సంబంధించి నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతి మేరకు ఈరోజు చర్లపల్లి జైలులో వున్న నిందితుడిని కస్టడీకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంతో పాటు నవీన్ను చంపేందుకు మరెవరైనా సాయం చేశారా అన్న కోణంలో పోలీసులు కీలక విషయాలను రాబట్టనున్నారు. హరిహరకృష్ణ ఇచ్చే సమాచారం ఆధారంగా అతని స్నేహితురాలు నిహారిక, స్నేహితుడు హాసన్ను విచారించనున్నారు. హత్య విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం అందించని అభియోగంపై వీరిపై చర్యలు తీసుకునే అవకాశాలు వున్నాయని సమాచారం.
ఇదిలావుండగా.. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ను హత్య చేసిన విషయం.. తన స్నేహితుడు, స్నేహితురాలు, తండ్రికి నిందితుడు చెప్పాడు. ఇంత జరిగినా వీరిలో ఏ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం అందించకపోవడంతో.. ఉన్నతాధికారులు ఈ ముగ్గురిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అన్నింటికి మించి హరిహరకృష్ణ స్నేహితురాలు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది.
Also REad: నిజామాబాద్ లో నవీన్ హత్యలాంటి ఘటన.. తన ప్రేయసిని ప్రేమించాడని స్నేహితుడి హత్య...!!
ఇప్పటికే మూడు సార్లు ఆమెను విచారించగా.. నోరు విప్పకపోవడంతో పోలీసులు ఆమెను సఖి సెంటర్లో కౌన్సెలింగ్కు పంపారు. అయినప్పటికీ ఆ అమ్మాయి తీరు మారలేదని సమాచారం. ఈ క్రమంలో తదుపరి చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. నిందితుడు హరిహరకృష్ణను కస్టడీకి తీసుకుని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దర్యాప్తును త్వరగా కొలిక్కి తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు.. హరిహరకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న కోర్ట్.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.
ALso REad: నవీన్ హత్య కేసు : మూడు సార్లు విచారణ, చివరికి కౌన్సెలింగ్ .. నోరువిప్పని హరిహరకృష్ణ గర్ల్ఫ్రెండ్
ఇకపోతే.. నవీన్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సుమారు 50కిపైగా సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ ఎక్కడికి వెళ్లాడు, ఎవరెవరిని కలిశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య కేసు విషయమై హరిహరకృష్ణ నుండి సమాచారం సేకరించడంతో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు. ఫోన్ డేటాను హరిహరకృష్ణ డిలీట్ చేసినట్టుగా పోలీసులు కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు నవీన్ ఫోన్ ఇంకా లభ్యం కాని విషయాన్ని పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ ఫోన్ విషయం కూడా హరిహరకృష్ణకు తెలిసే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.