హజీపూర్ సీరియల్ కిల్లర్ ప్రేయసి గురించి పోలీసుల ఆరా

By telugu teamFirst Published May 9, 2019, 7:06 AM IST
Highlights

తన ప్రేయసిని కూడా శ్రీనివాస రెడ్డి చంపేసి ఉంటాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్‌ సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాసరెడ్డిని పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు.

భువనగిరి: హజీపూర్ సీరియల్ రేపిస్టు, కిల్లర్ శ్రీనివాస రెడ్డి ప్రేయసి గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆమె జీవించే ఉందా, లేదా అనే విషయం తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వేములవాడలో శ్రీనివాస రెడ్డికి ఓ ప్రేయసి ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

తన ప్రేయసిని కూడా శ్రీనివాస రెడ్డి చంపేసి ఉంటాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్‌ సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాసరెడ్డిని పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. వరంగల్‌ సెంట్రల్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని యాదాద్రి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారం, హత్యకేసుల్లో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలను, శ్రీనివాస రెడ్డి ఇతర అరాచకాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 
శ్రీనివాసరెడ్డిని ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ మంగళవారం నల్లగొండ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో యాదాద్రి జిల్లా పోలీసులు వరంగల్‌కు రాగా సెంట్రల్‌జైలు సిబ్బంది వైద్యపరీక్షలు చేసిన తర్వాత శ్రీనివాసరెడ్డిని పోలీసులకు అప్పగించారు.
 
13 మంది పోలీస్ ఎస్కార్ట్‌తో రెండు వాహనాల్లో వచ్చిన యాదాద్రి పోలీసులు శ్రీనివాస రెడ్డిని తీసుకెళ్ళారు. శ్రీనివాస రెడ్డి ముగ్గురు బాలికలపైనే కాకుండా మరెవరిపైనైనా శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారాలకు పాల్పడి ఉంటాడా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో అతని ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న అమ్మాయిల వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

click me!