ప్రతి రోజూ చాటింగ్ చేసి ఆధ్మాత్మిక విషయాలపై చర్చించేవాడు. ఆమె పూర్తిగా తన మాటలను నమ్మిందని నిర్ణయించుకున్న తర్వాత తన పథకాన్ని అమలు చేశాడు.
నగరానికి చెందిన ఓ యువతికి ఓ ముఠా పెద్ద టోకరా వేసింది. సదరు మహిళకు ఆధ్యాత్మికం మీద నమ్మకం అని తెలుసుకొని.. ఆ విధంగానే టోపీ పెట్టారు. తాము అధిక మొత్తంలొ డబ్బులు పంపిస్తామని నమ్మించి.. సదరు మహిళ వద్ద నుంచి రూ.23లక్షలు కాజేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ కేసును రాచకొండ పోలీసులు చేధించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాచకొండ పరిధిలోని యాప్రాల్కు చెందిన ప్రశాంతి అనే మహిళకు ట్విటర్లో నియిబిజీ ఎడిగే అనే నైజీరియన్ పరిచయం అయ్యాడు. తన ఆధ్యాత్మిక భావాలతో ఆమెను ఆకట్టుకున్నాడు. ప్రతి రోజూ చాటింగ్ చేసి ఆధ్మాత్మిక విషయాలపై చర్చించేవాడు. ఆమె పూర్తిగా తన మాటలను నమ్మిందని నిర్ణయించుకున్న తర్వాత తన పథకాన్ని అమలు చేశాడు.
యూకేకు చెందిన ఓ ధనవంతుడు ఇండియాలోని పేదలకు 6,52,000 డాలర్స్ను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, వాటిని ఇండియాలో ఏదో ఒక చారిటీకి ఇచ్చేసి పేదల పెన్నిధిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడని నమ్మించాడు. ఆ డబ్బును మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. మీరు ఖర్చు చేయండి అని నమ్మించాడు. అందుకు ఆమె సరే అంది.
కొద్దిరోజుల తర్వాత బెంగళూరుకు చెందిన ఒబిడియమ్మ హిల్లరి, లాల్డెవిడ్ మలంగా, పౌకావుమౌన్లు ప్రశాంతికి ఫోన్ చేశారు. ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అంటూ పరిచయం చేసుకున్నారు. మీ పేరుతో నాలుగున్నరకోట్ల విలువైన అమెరికన్ డాలర్స్ వచ్చాయని, వాటిని మీ ఖాతాకు మళ్లించాలంటే.. కస్టమ్స్ చార్జీలు, ఆర్బీఐ క్లియరెన్స్, తదితర చార్జీల పేరుతో విడతల వారీగా ఆమె నుంచి రూ.23లక్షలు దోచేశారు. అయినా నాలుగున్నర కోట్లు రిలీజ్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో ఎలాంటి డబ్బు రాలేదని, అదంతా సైబర్ మోసమని తెలిసుకొని బాధపడింది. కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును చేధించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.