మోడీ హత్యకు మావోల కుట్ర: లేఖలో వరవరరావు పేరు

First Published Jun 8, 2018, 5:36 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టులు పన్నిన కుట్రకు సంబంధించిన లేఖలో ప్రముఖ విప్లవ కవి వరవరరావు పేరు ప్రస్తావనకు వచ్చింది.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టులు పన్నిన కుట్రకు సంబంధించిన లేఖలో ప్రముఖ విప్లవ కవి వరవరరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. పూణే పోలీసులకు చిక్కిన ఐదుగురు మావోయిస్టుల్లో జాకబ్ విల్సన్ రాసిన లేఖలో వరవరరావు పేరున్నట్లు వార్తలు వస్తున్నాయి.  రోనా జాకబ్ విల్సన్ ను పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. 

నక్సలైట్ సానూభూతి పరులతోనూ, కవి వరవరరావుతోనూ మాట్లాడినట్లు కామ్రేడ్ ఎం పేరు మీద రాసి లేఖలో ఉంది. ఆ విధమైన దాడులు చేయడానికి వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్  మార్గదర్శనం చేస్తారని ఆ లేఖలో ఉంది. పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో సురేంద్ర గాడ్లింగ్ ఉన్నారు లేఖలో ప్రస్తావనకు రావడంతో పూణే పోలీసులు వరవరరావును ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 

విల్సన్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో ఎం4 రైఫిల్ ను, నాలుగు లక్షల రౌండ్లను కొనుగోలు చేయడానికి 8 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాసి ఉంది. అందుకు వరవరరావు, సురేంద్ర మార్గదర్శనం చేస్తారని ఆ లేఖలో రాసి ఉందని టైమ్స్ నౌ ప్రసారం చేస్తూ ఆ లేఖను చదివి వినిపించింది. 

కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని వరవరరావు అన్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినంత మాత్రాన విల్సన్ తో తనకు సంబంధం లేదని చెప్పలేనని వరవరరావు అన్నారు. రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాటం చేస్తున్నవారిని టార్గెట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. తనను, విల్సన్ ను అరెస్టు చేయడానికే ఈ కుట్ర అని ఆయన అన్నారు. ప్రధాని మోడీపై దాడి చేసేంత శక్తి మావోయిస్టులకు ఉందా అనేది అనుమానమని ఆయన అన్నారు. 

click me!