
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రేపు (ఫిబ్రవరి 5) హైదరాబాద్కు (Hyderabad) రానున్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో పఠాన్చెరులోని ఇక్రిశాట్ క్యాంపస్కు చేరుకుంటారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను మోదీ ప్రారంభించనున్నారు. మొక్కల సంరక్షణపై ఇక్రిశాట్ వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయం, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన ఇక్రిశాట్ లోగోను మోదీ ఆవిష్కరిస్తారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంప్ను విడుదల చేయనున్నారు.
అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో ప్రధాని మోదీ ముచ్చింతల్ బయలుదేరనున్నారు. దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆయన ముచ్చింతల్లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. తొలుతు ముచ్చింతల్కు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడ 10 నిమిషాల పాటు రీప్రెష్ అవుతారు. అనంతరం నేరుగా యాగశాలకు వస్తారు. యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకొని విశ్వక్ సేనుడి పూజ చేస్తారు. అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొంటారు.
216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోదీ.. చినజీయర్ స్వామితో కలిసి పూజచేస్తారు. తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమివ్వనున్నారు. అనంతరం అక్కడి నుంచే మోదీ తన సందేశాన్ని ఇవ్వనున్నారు. మోదీ సమక్షంలోనే రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శిస్తారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా షెడ్యూల్లో మార్పులు జరగవచ్చని అధికారులు చెబుతున్నారు.
అనంతరం ముచ్చింతల్ ఆశ్రమం నుంచి ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మోదీ ఢిల్లీ బయలుదేరి వెళతారు. మోదీ ముచ్చింతల్ ఆశ్రమం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ప్రయాణించే మార్గంలో పోలీసులు ఆంక్షలు అమలు చేయనున్నారు. ఆ రూట్లో మోదీ ప్రయాణించే సమయంలో ఎవరినీ అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.
7వేల పోలీసులతో బందోబస్తు..
మోదీ పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 7వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు. ఇక్రిశాట్, ముచ్చింతల్ ఆశ్రమాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర పోలీసులతో ఎస్పీజీ అధికారులు సమన్వయం చేస్తున్నారు. ముచ్చింతల్ పరిసర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. శ్రీరామనగరంలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష..
ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను అనుకున్న విధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రధాని పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎస్ ఆదేశించారు. వేదికల వద్ద బ్లూ బుక్ ప్రకారం శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.