
వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజ్లో మెడికో ప్రీతి మెడికో ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే.. కాకతీయ మెడికల్ కాలేజ్లో మరో విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసిందనే ప్రచారం కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగి బలవన్మరణం చెందాలని చూసిందని అయితే దీనిని గమనించిన తోటి విద్యార్థులు కాలేజ్ యాజమాన్యానికి సమాచారం అందించగా.. వారు ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి రహస్యంగా చికిత్స అందించారనే వార్తలు వచ్చాయి.
అయితే అందులో వాస్తవం లేదని కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మోహన్దాస్ తెలిపారు. మెడికో ఆత్మహత్యకు యత్నించలేదని చెప్పారు. విద్యార్థిని మైగ్రేన్తో బాధపడుతున్నారని.. దానికి సంబంధించి మెడిసిన్ వాడుతున్నట్లు తెలిపారు. అయితే నిన్న రాత్రి, ఈరోజు ఉదయంమైగ్రేన్కు సంబంధించిన మెడిసిన్ను వేసుకోవడంతో స్వల్ప అస్వస్థతకు గురైందని.. దీంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించినట్టుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఇక, విద్యార్థిని అబ్జర్వేషన్ కోసం ఆస్పత్రిలో ఉంచినట్టుగా అధికారులు చెబుతున్నారు.