
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో అమానుష ఘటన చోటుచేసకుంది. ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడం అతడి సహాయకులు కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. బయటి నుంచి లిఫ్ట్ వరకు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారు. అయితే రోగిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది సహకరించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రెండు వారాల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ పరిణామాలపై నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆ రోగిని మార్చి 31 ఆస్పత్రికి తీసుకొచ్చారని.. లిఫ్ట్ వచ్చిందనే తొందరలో అతడి సహాయకులే కాళ్లు పట్టుకుని లాక్కెళ్లరని చెప్పారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యమేమి లేదని తెలిపారు.