జనగామలో దారుణం.. చెత్తకుప్పలో చిన్నారి..

By Bukka SumabalaFirst Published Aug 29, 2022, 2:15 PM IST
Highlights

రోజుల వయసున్న పసిగుడ్డును చెత్తకుప్పల్లో పడేశారు తల్లిదండ్రులు. ఆ చిన్నారి ఏడుపు విన్న స్థానికులు రక్షించారు. అయితే, చిన్నారి అనారోగ్యంతో, తలమీద కణితితో ఉండడంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.  

జనగామ : రోజులు మారుతున్న అన్నిరంగాల్లో సమాజం అభివృద్ధి చెందుతున్న ఆడపిల్లలపై వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ వివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. అవి ఏమాత్రం ప్రయోజనం కలిగించలేక పోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అంతగా లేనప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా కనిపిస్తోంది. నిరక్షరాస్యత, కుటుంబ,  ఆర్థిక పరిస్థితులు, ఆడ పిల్లలనుపెంచడం భారమనో, కొడుకు పుట్టలేదనో..  కారణం ఏదైనప్పటికీ పలు ఘోరాలకు పాల్పడుతున్నారు.  కడుపున పుట్టిన బిడ్డలను నిర్థాక్షిణ్యంగా వదిలించుకుంటున్నారు. తల్లి పొత్తిళ్లలో సేద తీరాల్సిన చిన్నారులు ముళ్ళ కంపలు, మురుగు కాలువలు, చెత్తకుప్పలకు చేరువవుతున్నారు.

తాజాగా జనగామ జిల్లాలోని ఇలాంటి ఘటన వెలుగు చూసింది.  తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లిలో గుర్తుతెలియని ఆడశిశువు లభ్యమయింది. బస్టాండ్ సమీపంలోని ముళ్ళ పొదల్లో  చిన్నారి ఏడుపులు విన్న స్థానికులు వెళ్లి చూస్తే.. ఆడశిశువు కనిపించింది. అందులో ఒకరు.. చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.  శిశువు అనారోగ్యంతో ఉన్నా తాము పెంచుకుంటాం అంటూ ఆపన్నహస్తం అందించారు. అయితే శిశువు తల పై కణితి ఉండడంతోపాటు అనారోగ్యంతో బాధపడుతోంది. 

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డుప్రమాదం... వృద్దురాలిని చిదిమేసిన కారు

ఈ కారణంతోనే వదిలేసి వెళ్లి ఉంటారని చర్చించుకుంటున్నారు.  సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు, శిశుసంరక్షణ అధికారులు చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. చికిత్స అందించేందుకు హైదరాబాదులోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పాపను పెంచుకుంటానని ముందుకు వచ్చిన మహిళ.. మాతృత్వం అందినట్టే అంది దూరమవడంతో విపరీతంగా రోధించింది.. ఆమె రోధన స్థానికులను కలచివేసింది. 

click me!