
తన భవనానికి రావాల్సిన అద్దె (mpdo office rent) చెల్లించేంతవరకు ఎంపీడీఓ కార్యాలయానికి (mpdo Office) తాళం వేశాడు ఇంటి యజమాని. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాలో (karimnagar district) నూతన మండలాల ఆవిర్భావంలో భాగంగా గన్నేరువరం (ganneruvaram) మండలాన్ని అధికారులు నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కార్యాలయం ఏర్పాటు కోసం అధికారులు ప్రైవేట్ భవనాల్లో ఆఫీసులు నెలకొల్పారు. ఇందులో భాగంగా గన్నేరువరం ఎంపీడీవో కార్యాలయం కోసం 2019 జులైలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ. 12,500 చొప్పున కిరాయి ఇచ్చేందుకు అధికారులు .. ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నారు.
అప్పటినుండి ఇప్పటివరకు 29 నెలలు గడవగా 11 నెలల కిరాయి మాత్రమే ఇచ్చారని మిగతా కిరాయి ఇవ్వడం లేదని ఇంటియజమాని తిరుపతి వాపోయారు. అద్దె చెల్లించాలని అడుగుతుంటే అధికారులు రేపు, మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు అద్దె రూపంలో రూ. 2.25 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు. బ్యాంకు లోను తీసుకుని భవనాన్ని కట్టించానని, నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన అద్దె బకాయి మొత్తం చెల్లించే వరకూ ఎంపీడీవో కార్యాలయ తాళం తీసేది లేదని ఆయన తేల్చిచెప్పాడు.
"