
Onion prices skyrocket in Hyderabad: దేశ రాజధాని ప్రాంతంలో ఉల్లి ధరలు 25-50 శాతం పెరిగాయి. ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలోకు రూ .50-70 వరకు రిటైల్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీ రైతు బజార్ లో కూడా ఉల్లి కిలో రూ.46కు చేరింది. హైదరాబాద్ లో కేజీ ఉల్లి రూ. 40-45 వుండగా, డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా కొత్త పంట రావడానికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ లో...
సప్లయ్-డిమాండ్ సరిగా లేకపోవడంతో హైదరాబాద్లో ఉల్లి ధరలు కొద్ది వారాల్లోనే రెట్టింపు అయ్యాయి. ఆలస్యమైన రుతుపవనాలతో పంటలపై ప్రభావం పడటంతో సరఫరా తక్కువగా ఉండడమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని వారాల క్రితం వరకు రూ.10కి విక్రయించిన ఉల్లి.. గత వారం రూ. 20-25 వుండగా, ప్రస్తుతం రూ. 40-45 లకు చేరుకుంది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో టమాటా ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఉల్లి ధరలతో పాటు వివిధ కూరగాయల ధరలు పెరుగుతుండటంపై సామాన్య ప్రజానీకం ఆందోళన చెందుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో..
రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి ధర నిరంతరం పెరుగుతూనే ఉంది. కూరగాయలు సరసమైన ధరకు లభించే రైతు బజార్లలో కూడా ఉల్లి కిలో రూ.46కు చేరింది. రిటైల్ మార్కెట్లో రూ.60 నుంచి రూ.70 వరకు లభిస్తోంది. అధిక ధర ఉన్నప్పటికీ, కూరగాయల నాణ్యత తక్కువగా కనిపిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉల్లిపంటపై ప్రభావంతో డిమాండ్ కు సరిపడా సప్లై పడిపోయిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్ర నుండి సరఫరా కూడా ప్రభావితమైంది. ఆంధ్రప్రదేశ్కు కర్నూలు ప్రధాన ఉల్లి సరఫరాదారు అయినప్పటికీ, రాష్ట్రం కూడా సరఫరా కోసం కర్ణాటక, మహారాష్ట్రలపై ఆధారపడి ఉంది.