ఏటిఎంలే అతడి టార్గెట్...118 కేసులు, 11సార్లు జైలుకు

By Arun Kumar PFirst Published Sep 27, 2020, 7:20 AM IST
Highlights

డబ్బులు విత్ డ్రా చేసుకోడానికి ఏటిఎంల వద్దకు వచ్చేవారిని బోల్తా కొట్టించి వారి అకౌంట్లను నుండి డబ్బులు స్వాహా చేస్తున్న ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

సిద్దిపేట: ఏటిఎంల వద్దకు వచ్చే అమాయకులే అతడి టార్గెట్. డబ్బులు విత్ డ్రా చేసుకోడానికి వచ్చేవారిని బోల్తా కొట్టించి వారి అకౌంట్లను నుండి డబ్బులు స్వాహా చేస్తున్న ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇలా దొంగతనాలే ప్రవృత్తిగా పెట్టుకున్న ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తిని సిద్దిపేట పోలీసుల అరెస్ట్ చేశారు.  

ఏపీకి చెందిన రాజ్ కుమార్ ఈజీమనీ సంపాదించడానికి దొంగతనాల బాట పట్టాడు. ఇందులో భాగంగా ఏటీఎంల వద్ద కాపుగాసి డబ్బులు తీసుకోడానికి వచ్చే అమాయకులను టార్గెట్ చేసేవాడు. వారికి ఏటిఎం నుండి డబ్బులు తీసి ఇవ్వడానికి సహాయం చేస్తున్నట్లుగా నమ్మించి వారివద్ద నుండి అత్యంత చాకచక్యంగా కార్డును తస్కరించేవాడు. అలాగే పిన్ నంబర్ కూడా తెలుసుకుని వారి చేతిలో నకిలీ కార్డును పెట్టేవాడు. 

ఇలా అసలు కార్డుతో అకౌంట్లో వున్న మొత్తం డబ్బును దోచుకుని జల్సా చేసేవాడు. ఏటిఎంల వద్ద మోసాల కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు రాజ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 18 ఏటీఎం కార్డులు, రూ.80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌కుమార్‌పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 118 కేసులు నమోదవగా 11 సార్లు జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 

click me!