కాంగ్రెస్ లోకి త్వరలో వలసలు.. తెలంగాణ కు చెందిన ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేల చేరిక : ఏలేటి మహేశ్వర రెడ్డి

By SumaBala BukkaFirst Published Oct 13, 2022, 8:53 AM IST
Highlights

తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రాబోతున్నారని తెలిపారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ఆయన బుధవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ నుంచి ఒక ఎంపీ,  దక్షిణ తెలంగాణా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని తెలిపారు. వారంతా కాంగ్రెస్ నాయకత్వంతో అందుబాటులో ఉన్నారని.. రాహుల్ యాత్ర తరువాత చేరికలు ఉంటాయా?.. ఈ లోపే ఉంటాయా? అనేది త్వరలోనే తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై వ్యాఖ్యలు చేసే స్థాయి మంత్రి కేటీఆర్ కు లేదన్నారు. 

ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడాన్ని తాను అంగీకరించనని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ రంగయూనిట్ల ప్రైవేటీకరణను అనుమతించబోదని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. అలాగే హిందీని మాత్రమే జాతీయ భాషగా మార్చే ఉద్దేశ్యం తమకు లేదని తేల్చి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర కొనసాగిస్తోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎత్తిచూపడంతో పాటు దేశంలో విభజన శక్తులను ఎదుర్కోవడానికి.. భారత్ ను ఏకం చేసే లక్ష్యంతో తాము దేశ వ్యాప్త భారత్ జోడో యాత్ర చేస్తున్నామని ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  

నయీం దోచుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని.. బాధితులకు తిరిగి ఇచ్చే ప్రక్రియకు గండి..

కన్యాకుమారి వరకు సాగే ఈ పాదయాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ భారత యాత్ర సందర్భంగా బుధవారంనాడు అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వ్యూహరచన చేస్తోందని తెలిపారు. ఉపాధి అవకాశాలను మెరుగు పరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని  పేర్కొన్నారు. 

కాగా, ఏసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ గురువారం నాడు హైదరాబాద్ కు రానున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చిస్తారు. ఈనెల 23వ తేదీన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. దీంతో ఈ యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు వేణుగోపాల్ హైదరాబాద్కు వస్తున్నారు. యాత్ర ఏర్పాట్లపై తెలంగాణ కాంగ్రెస్ నేతలతో గాంధీభవన్లో సమావేశం నిర్వహించనున్నారు. భారత్ జోడో యాత్రకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు ఇంకా చేయాల్సిన ఏర్పాట్ల గురించి కేసీ వేణుగోపాల్ చర్చించనున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతుంది. కర్ణాటకలోని రాయచూర్ నుండి తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలోకి రాహుల్ పాదయాత్ర ఈ నెల 23న ప్రవేశించనుంది.

click me!