Sangareddy Accident: కలల బైక్ పై స్వగ్రామానికి వెళుతుండగా ఘోరం... యువకుడు మృతి

By Arun Kumar PFirst Published Dec 22, 2021, 10:16 AM IST
Highlights

 సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలో ఆటో-బైక్ ఎదురురెదుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

సంగారెడ్డి: తన కలల బైక్ ను సొంతంచేసుకున్న ఆనందంలో రయ్ రయ్ మంటూ వెళుతూ ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొత్త బైక్ పై ఎంతో ఆనందంతో స్వగ్రామానికి వెళుతుండగా రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ఆటో యువకున్ని బలితీసుకుంది. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా (sangareddy district)లో చోటుచేసుకుంది. 

కామారెడ్డి జిల్లా (kamareddy district) నిజాంసాగర్ మండలం వెల్గనూరు గ్రామానికి చెందిన గువ్వ సాయిలు(22) ఉపాధినిమిత్తం హైదరాబాద్ (hyderabad) లో నివాసముండేవాడు. మల్లాపూర్ లో నివాసముంటూ శుభకార్యాలతో పాటు వివిధ  కార్యక్రమాలకు వేదికలను అలంకరించే (decoration) పని చేస్తుండేవాడు. 

అయితే ఎన్నో రోజులుగా సాయిలు బైక్ కొనుగోలు చేయాలని ఆశించేవాడు. ఇందుకోసం డబ్బులు కూడబెట్టి ఎట్టకేలకు మంగళవారం హైదరాబాద్ లోనే కొత్త బైక్ కొనుగోలు చేసాడు. షోరూంలో కొనుగోలుకు సంబంధించిన పనులను ముగించుకుని కొత్త బైక్ స్వగ్రామానికి బయలుదేరాడు. 

read more  హైదరాబాద్: బైక్ నడిపేవారే కాదు, వెనకున్న వారు హెల్మెట్ పెట్టాల్సిందే.. లేకుంటే

ఈ క్రమంలో జోగిపేట (jogipet) సమీపంలో అతడు మంచి వేగంతో దూసుకుపోతుండగా ఓ ఆటో రాంగ్ రూట్ లో వచ్చింది. ఒక్కసారిగా ఆటో ఎదురుగా రావడంతో బైక్  కంట్రోల్ కాకపోవడంతో అదే వేగంతో వెళ్లి ఢీకొట్టాడు.  దీంతో తలకు తీవ్ర గాయమై అధికంగా రక్తస్రావం కావడంతో సాయిలు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్ చాకలి రవీందర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ముందుభాగం దెబ్బతినగా బైక్ పూర్తిగా తుక్కుతుక్కయ్యింది. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన రవీందర్ ను జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం సాయిలు మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

read more  భార్యాభర్తల గొడవ.. కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. ఒకరి హత్య, ముగ్గురికి గాయాలు...

మృతుడు సాయిలు వివరాలను సేకరించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో జోగిపేట హాస్పిటల్ వద్దకు  చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాయిలు తండ్రి కొడుకును తలచుకుని రోదించడం చూసేవారికీ కన్నీరు పెట్టిస్తోంది. తన భార్య గతంలోనే చనిపోయినా కొడుకు కోసమే బ్రతుకుతున్నానని... ఇప్పుడు అదే కొడుకు లేడు...ఎవరి కోసం తాను బ్రతకాలి అంటూ ఆ తండ్రి రోదిస్తున్నాడు.

ఇదిలావుంటే సోమవారం అర్దరాత్రి పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. గోదావరిఖని(Godavarikhani)లో గంగానగర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. రెండు లారీలు పరస్పరం ఢీకొట్టుకుని పక్కనే ఉన్న ఆటోపై పడటంతో దంపతులతో సహా చిన్నారి మరణించారు. మరికొందరూ ఈ ఘటనలో గాయపడ్డారు.

రామగుండానికి చెందిన షేక్ షకీల్, అతని భార్య, ఇద్దరు పిల్లలు సహా మరో ఇద్దరు వ్యక్తులు ఆ ఆటోలో ప్రయాణిస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి వారు వెళ్తున్నారు. ఈ ప్రయాణంలో వారు గోదావరిఖనికి చేరారు. అక్కడ గంగానగర్ ఫ్లైఓవర్ వద్దకు చేరగానే ఈ ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. ఫ్లైఓవర్ యూటర్న్ వద్ద బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ.. మట్టి లోడ్‌తో వస్తున్న మరో లారీ ఢీకొట్టుకున్నాయి. అనంతరం పక్కనే ఉన్న ఆటోపై బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో షేక్ షకీల్, రేష్మ, మరో చిన్నారి మరణించారు. కాగా, ఇదే దుర్ఘటనలో రెండు నెలల చిన్నారి సహా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
 

click me!