వరంగల్ లో పసిబాలున్ని చంపిన లేగదూడ

First Published Jun 1, 2018, 3:09 PM IST
Highlights

సరదాగా ఆడుకుంటూ మృత్యుఒడిలోకి...

లేగదూడతో సరదాగా ఆడుకోవాలనుకున్న ఆ పిల్లాడి కోరికే అతడిపాలిట మృత్యువుగా మారింది. లేగదూడకు కట్టిన తాడును పట్టుకుని దాంతో ఆడుకుంటుండగా ప్రమాదం జరిగి ఓ చిన్నారి మృత్యువాతపడిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం అంబాలా గ్రామానికి చెందిన ఎల్లంశెట్టి సాంబయ్య-లలిత దంపతులకు వర్షిత్, మౌనిక అనే ఇద్దరు పిల్లలున్నారు. వీరు సరదాగా ఇంటి ఆవరణ లో తమ లేగదూడతో ఆడుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత దూడకు నీరు తాగించడానికి వర్షిత్ తన చిన్నారి చేతులతో దూడకు కట్టిన తాడు పట్టుకుని చేతి పంపు వద్దకు తీసుకెళ్లాడు. అయితే నీరు తాగేంత వరకు ప్రశాంతంగా వున్న ఆ దూడ ఒక్కసారిగా పరుగు అందుకుంది. ఈ క్రమంలో తాడు చేతికి ఇరుక్కుపోవడంతో వర్షిత్ ను లేగదూడ తనతో పాటు లాక్కుపోయింది. ఒక్కసారిగా కిందపడేసి రోడ్డుపై కొద్దిదూరం ఈడ్చుకుపోవడంతో బాలుడి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇలా తీవ్రంగా గాయపడిన వర్షిత్ ను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మృతిచెందాడు. అప్పటివరకు తమ కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి బాలుడు ఒక్కసారిగా ఇలా ప్రమాదానికి గురై చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

click me!