
చేతిలో డబ్బులున్నా తినలేని పరిస్థితి, బ్యాంకుల్లో కోట్లు కోట్లు మూలుగుతున్న ఖర్చు చేయలేని దుస్థితి.. ఇదీ దేశంలో తాజా పరిస్థితి..
పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ బాధ పోయి దేశం బాగుపడుతుందో లేదో తెలియదు కానీ సామాన్యుడి ప్రాణాలు మాత్రం పోతున్నాయి.
ఏటియంల వద్ద చాంతాడంత క్యూలు... బ్యాంకుల వద్ద పడిగాపులు... ఎక్కడ చూసినే ఇప్పుడు ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. గంటల తరబడి ఏటియంలు, బ్యాంక్ ల వద్ద పడిగాపులు పడినా పైసా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా బ్యాంకులు, ఏటియంల వద్ద క్యూలో నిలబడే మహిళలు, వృద్దుల పరిస్థితి దారుణంగా తయారైంది.
ఈ రోజు మధ్యాహ్నం నగరంలోని మారేడ్ పల్లి లోని ఆంధ్రా బ్యాంక్ లో నోట్ల మార్పడికి వచ్చిన లక్ష్మీనారాయణ అనే వృద్ధుడు రెండు గంటల పాటు క్యూలో ఉన్నాడు. క్యూలో నిల్చుని ఉండగానే గుండెపోటుతో లక్ష్మీనారాయణ ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.