కళ్లు దానం చేసిన కంఠమనేని ఉమామహేశ్వరి .. పోస్ట్‌మార్టం పూర్తి, ఎల్లుండి అంత్యక్రియలు

By Siva KodatiFirst Published Aug 1, 2022, 6:37 PM IST
Highlights

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కళ్లను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తవ్వగా.. ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు

ఆత్మహత్య చేసుకున్న ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కళ్లను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇకపోతే.. ఉమామహేశ్వరికి ఇద్దరు కూతుళ్లు విశాల, దీక్షిత. ప్రస్తుతం పెద్దకూతురు విశాల అమెరికాలో వుండగా.. చిన్న కుమార్తె దీక్షితకు ఇటీవలే వివాహమైంది. ఆత్మహత్య సమయంలో తల్లితో పాటే దీక్షిత వుంది. 

ఇకపోతే.. తొలుత అనారోగ్య కారణాలతో ఉమామహేశ్వరి మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు ఆత్మహత్యగా తేల్చడంతో ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగానే ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 2.30కి ఉమామహేశ్వరి కూతురు దీక్షిత కాల్ చేసిందన్నారు. తన తల్లి ఆత్మహత్య చేసుకుందని దీక్షిత సమాచారం ఇచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2.45కి ఉమామహేశ్వరి నివాసానికి వెళ్లామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉమామహేశ్వరి గదిలోకి వెళ్లామని... దీక్షిత ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. 

Also REad:లోపలికి వెళ్లి ఎంతకూ బయటకు రాలేదు, తలుపులు బద్దలుకొట్టి చూస్తే.. : కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తె

అంతకుముందు ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతోనే తన తల్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురమే వున్నామని.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమ్మ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుందన్నారు. భోజనం సమయం వరకు బయటకు రాకపోవడంతో .. తలుపులు తెరిచే ప్రయత్నం చేశామని దీక్షిత చెప్పారు. లోపలి నుంచి గడియ పెట్టుకుని ఉందని.. ఆత్మహత్య సమయంలో తన భర్తతో పాటు నాన్న కూడా ఇంట్లోనే వున్నారని దీక్షిత తెలిపారు. 

click me!